హీరోయిన్లు గ్లామర్ కోసమే

29 Jul, 2015 03:38 IST|Sakshi
హీరోయిన్లు గ్లామర్ కోసమే

హీరోయిన్లను దక్షిణాది చిత్ర పరిశ్రమలో గ్లామర్ కోసమే వాడుకుంటున్నారని నటి నిత్యామీనన్ మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏ విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడే ఈ కేరళ కుట్టికి పొగరుబోతు అనే పేరు కూడా ఉంది. అలాంటి నిత్యమీనన్ ఇటీవల వరుసగా మూడు విజయాలను అందుకున్న ఆనందంలో మాట్లాడుతూ సమీపంలోని నటించిన మూడు చిత్రాలు విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు.
 
 ఈ మూడు చిత్రాల్లోనూ వైవిధ్యభరిత పాత్రలు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ కాదల్ కన్మని(ఒకే బంగారం)లో నటించడం మరచిపోలేని అనుభవంగా వ్యాఖ్యానించారు. అయితే ఆ చిత్రంలో కంటే లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన-2లో వికలాంగ యువతిగా నటించడం బాగా నచ్చిందన్నారు. అది దెయ్యం ఇతివృత్తంతో తెరకెక్కినా తన పాత్రను చాలెంజ్‌గా తీసుకుని నటించానన్నారు. తాను నటించే చిత్రాల్లో కొన్ని నిబంధనలు విధించుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా చిత్ర స్క్రీన్‌ప్లే నచ్చకుంటే అందులో నటించే ప్రసక్తే లేదన్నారు.
 
 సినిమా కథను ఎలా చెబుతున్నారన్నది ముఖ్యం అన్నారు. కథా పాత్రతో పాటుగా కథనం చిత్రానికి ముఖ్యం అని అన్నారు. మరో విషయం ఏమిటంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిక్యం కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. హీరోయిన్లను గ్లామర్ కోసమే ఉపయోగించుకుంటున్నారన్నారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. హీరోయిన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలని నిత్యామీనన్ విజ్ఞప్తి చేశారు.
 

మరిన్ని వార్తలు