శివాజీపార్క్‌లో దసరా ర్యాలీ వద్దు

25 Sep, 2013 05:52 IST|Sakshi

సాక్షి, ముంబై:  శివసేన ప్రతి ఏటా దాదర్‌లోని శివాజీపార్క్‌లో నిర్వహించే దసరా ర్యాలీకి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అనుమతిని నిరాకరించింది. ఆ ప్రాంతం సెలైంట్ జోన్ పరిధిలోకి వస్తుందని తేల్చిచెప్పింది. ఈ విషయం శివసేన పార్టీకి తలనొప్పిగా మారింది. బాల్‌ఠాక్రే లేకుండా తొలిసారిగా జరుగుతున్న ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
 
 కోర్టుకు వెళ్లనున్న శివసేన...
 దసరా ర్యాలీ అనుమతి కోసం శివసేన కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. గతంలో ఎదురైనా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కూడా హైకోర్టుకు వెళ్లాలని శివసేన పార్టీ నాయకులు నిర్ణయించారు.   గత ర్యాలీకి కూడా బీఎంసీ అనుమతి నిరాకరించింది. అయితే శివసేన నేత అనీల్ పరబ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సానుకూల నిర్ణయం వెలువడింది. అయితే అదే సమయంలో వచ్చే ఏడాది మాత్రం మరో ప్రత్యామ్నాయ స్థలాన్ని ర్యాలీ కోసం చూసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో ఈసారి మళ్లీ కోర్టు అనుమతిస్తుందా..?, గతంలో చెప్పినట్టుగా ఏదైన వేరే స్థలం చూసుకోవాలని సూచిస్తుందా..? అని పార్టీ నాయకుల్లో అంతర్మథనం మొదలైంది.

మరిన్ని వార్తలు