తిరువొత్తియూరు: వివాహేతర సంబంధాన్ని ఖండించినందుకు ఆగ్రహం చెందిన నర్సు ప్రియుడితో కలసి తండ్రిని కడతేర్చింది. ఈ సంఘటన సేలం సమీపంలో చోటుచేసుకుంది. సేలం సమీపం వీరాణం, సుక్కంపట్టికి చెందిన తొప్ప గౌండర్ (67). అక్కడున్న పాఠశాలలో సెక్యూరిటీగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఇతని భార్య ధనం. వీరికి శశికళ (37) అనే కుమార్తె, సదాశివం అనే కుమారుడు ఉన్నాడు. శశికళ సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నది. ఈమె భర్త భగత్సింగ్ పల్లడం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నాడు. వీరికి జనని (8) అనే కుమార్తె ఉంది. శశికళ తండ్రి వద్దనే ఉంటున్నది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నలుగురి వ్యక్తులు తొప్ప గౌండర్ ఇంటికి వచ్చి అతనిపై కత్తితో దాడి చేసి హత్య చేశారు.
దీనిపై ఫిర్యాదు అందుకున్న వీరాణం ఇన్స్పెక్టర్ శరవణన్, పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలన చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో శశికళకు, సేలం ఆసుపత్రిలో పని చేస్తున్న రాజా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడిందని ఈ సంగతి తెలుసుకున్న తోపు గౌండర్ కుమార్తెను మందలించాడు. దీంతో ఆగ్రహం చెందిన శశికళ తన ప్రియుడితో కలసి తండ్రిని కడతేర్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో నర్సు శశికళ సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.