లక్ష బావులు, యాభైవేల చెరువులు

14 Aug, 2015 03:04 IST|Sakshi

 తవ్వించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
కరువు నివారణ చర్యల్లో భాగంగానే..
 
 ముంబై : ముంచుకొస్తున్న కరవును నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లక్ష బావులు, యాభైవేల చెరువులు తవ్వించాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి పనులు ప్రారంభమవుతాయని ఈ మేరకు సీఎం ఫడ్నవీస్ గురువారం వెల్లడించారు. కరవు వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ‘ఈ కార్యక్రమం వల్ల 14 జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది.

ప్రస్తుతమున్న బావుల తవ్వకం పనులు తొందరగా పూర్తి చేసి, వ్యవసాయం కోసం మరో లక్ష బావులు, యాభైవేల చెరువులు తవ్విస్తాం’ అని సీఎం అన్నారు. రాష్ట్రం ప్రస్తుతం సహజ విపత్తుల వల్ల ఇబ్బంది పడుతోందని, తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బంది తలెత్తుతోందని చెప్పారు. గతేడాది అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ ఏడాది అసలు వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, మేత లేక పశువులు అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో కరువు నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని జిల్లాల అధికారులకు సూచించినట్లు చెప్పారు. నీటి సంరక్షణ చర్యలతో పాటు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆహార భద్రత పథకాలు ప్రారంభిస్తామని, రాజీవ్ గాంధీ జీవనిధి యోజన పథకం కింద ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పారు.

 ‘అంధేరీ-దహిసర్’ మెట్రోకు సర్వం సిద్ధం
 అంధేరీ తూర్పు-దహిసర్ తూర్పు మెట్రోకు ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీజ్ ఆమోదం తెలపనున్నారు. రూ.5,757 కోట్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనం పూర్తి చేసిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ).. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ)కి నివేదిక సమర్పించింది. 16.5 కిమీ మేర నిర్మించే ఈ మెట్రో మార్గానాకి గాను నాలుగు నుంచి నాలుగున్నర ఏళ్ల సమయం పడుతుందని, ఈ కారిడార్‌లో 16 స్టేషన్లు ఉంటాయని ఎమ్మెమ్మార్డీఏ సీనియర్ అధికారి అన్నారు.

మరిన్ని వార్తలు