న్యూఢిల్లీ: ఆకాశన్నంటుతున్న ఉల్లి గడ్డ ధరల ప్రభావం వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తుందని బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. ఇది దీక్షిత్ ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తుందని ఆమె జోస్యం చెప్పారు. 15 ఏళ్ల క్రితం ఎన్నికలకు ముందు కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో అధికారంలో ఉన్న కాషాయకూటమికి ఎదురైన పరాభవాన్ని ఆమె గుర్తు చేశారు. అప్పుడు షీలాదీక్షిత్ ఉల్లిగడ్డ దండలు ధరించి పెద్ద సమస్య చేసి సృష్టించారన్నారు.
ఇప్పుడు అదే ఉల్లి కాంగ్రెస్ సర్కార్ను కూల్చేం దుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ రాసిన ‘ఏ టేల్ ఆఫ్ టూ డ్రాప్స్’ రివైజ్డ్ ఎడిషన్ను పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం విడుదల చేశారు. దేశ రాజధానిని కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి కలిగిచేందుకు ఢిల్లీ బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగే అనేక బహిరంగ సభల్లో ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దింపే అభ్యర్థుల జాబితాను బీజేపీ గురువారం ప్రకటించే అవకాశముందన్నారు.