'మా కుమార్తెలను సన్యాసినులుగా మార్చారు'

10 Aug, 2016 23:24 IST|Sakshi
'మా కుమార్తెలను సన్యాసినులుగా మార్చారు'

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రం వివాదాల్లో చిక్కుకుంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరు కుమార్తెలను బలవంతంగా సన్యాసినులుగా మార్చేసి కేంద్రంలోనే ఉంచుకున్నారని కోయంబత్తూరుకు చెందిన సత్యజ్యోతి మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ వేశారు. యోగా కేంద్రంలోని సోదరీమణులను విచారించి 11వ తేదీన నివేదిక దాఖలు చేయాలని కోవై ప్రధాన న్యాయమూర్తిని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

పిటిషన్‌లోని వివరాలు.. కోవైకి చెందిన కామరాజ్, సత్యజ్యోతిలకు లత,గీత ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ అవివాహితులు. ప్రముఖ యోగా గురువు జగ్గివాసుదేవ్ నేతృత్వంలో కోవై వెల్లియంగిరి కొండ ప్రాంతంలో నెలకొల్పిన ఈషా యోగా కేంద్రానికి ఏడాది క్రితం వెళ్లిన కుమార్తెలు ఇంటికి రాలేదు. వారిని కలుసుకునే అవకాశమూ కల్పించలేదు. తమ కుమార్తెలకు గుండు కొట్టించి సన్యాసినులుగా మార్చిసినట్లు తెలుసుకుని కృంగిపోయాం. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వారిద్దరినీ సన్యాసులుగా మార్చడం చట్టవిరుద్దం. తమ కుమార్తెను విడిపించాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. వెంటనే తమ ఇద్దరు కుమార్తెలను కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలని సత్యజ్యోతి పిటిషన్‌లో పేర్కొన్నారు.

న్యాయమూర్తులు ఎస్ నాగముత్తు, వి.భారతీదాసన్ ఈ పిటిషన్‌ను బుధవారం విచారించారు. పిటిషన్ దారు కోరినట్లు ఇద్దరు యువతులను హాజరుపర్చాలని ఆదేశించడం లేదు. అయితే కోవై జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీని వెంటపెట్టుకుని బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈషా యోగా కేంద్రానికి వెళ్లాలి. పిటిషన్‌దారుని ఇద్దరు కుమార్తెలను కలుసుకోవాలి. ఇష్టపూర్వకంగా సన్యాసినులుగా మారారా లేదా బలవంతంగా చేర్చుకున్నారా అనే అంశంపై వారిద్దరి నుంచి పూర్తి వివరాలను సేకరించి గురువారం నివేదికను హైకోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అక్కాచెల్లెళ్లు ఇష్టపూర్వకంగానే ఈషాలో చేరినట్లు రుజువైతే హైకోర్టు జోక్యం చేసుకోదని వారు స్పష్టం చేశారు. కేసును గురువారానికి (11వ తేదీ) వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు