సాక్షి, చెన్నై: తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్కు మధురై కోర్టు షాకిచ్చింది. గత మూడేళ్ళుగా ధనుష్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ధనుష్ తమ కొడుకే అని చిన్నతనంలో అతనిని మందలిస్తే ఇంటి నుంచి వెళ్లిపోయాడంటూ మదురైకి చెందిన దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ధనుష్ జనన, విద్య, నివాసానికి సంబంధించిన ధృవ పత్రాలను అసలెందుకు తీసుకురాలేదంటూ ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అతనికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను కోర్టుకు అందజేయాలని చెన్నై కార్పోరేషన్కు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మీరు ఎవరో తెలియదు అంటుంటే గుండె తరుక్కుపోతోందని కదిరేషన్ దంపతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. డీఎన్ఏ పరీక్షలు చేయించాలంటూ వారు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. అయితే ధనుష్ ఇది వరకు పుట్టుమచ్చలను కూడా తొలగించుకున్నాడనే వ్యవహారం వారి వాదనలకు బలం చేకూరుస్తోంది. అయితే దీనిపై ధనుష్ స్పందిస్తూ.. వృత్తిలో భాగంగానే అలా చేయాల్సి వచ్చిందంటూ చెప్తుండటం గమనార్హం.