విద్యుత్ శాఖకు కోర్టు షాక్

30 Nov, 2016 16:40 IST|Sakshi
ధర్మారం: బాధితుని కుటుంబానికి పరిహారం అందించటంలో విఫలమైన విద్యుత్ శాఖ అధికారులకు పెద్దపల్లి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. విద్యుత్‌ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశించింది. వివరాలివీ.. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన రవి అనే యువకుడు1999లో విద్యుత్‌షాక్‌తో చనిపోయాడు. ఈ మరణానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ అతని కుటుంబసభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు పరిహారంగా రూ.1.50 లక్షలు చెల్లించాలని 2001లో ఆదేశించింది.
 
అయితే, అధికారులు చెల్లించలేకపోయారు. దీంతో కోర్టు మరోసారి గడువు పొడిగించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనిపై మృతుని కుటుంబసభ్యులు న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన న్యాయస్థానం విద్యుత్ శాఖ కార్యాలయాన్ని జప్తు చేసి, నష్ట పరిహారం అందజేయాలని అధికారులను బుధవారం ఆదేశించింది. ఈ మేరకు కోర్టు సిబ్బంది ధర్మారం ఎన్పీడీసీఎల్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, తాము పరిహారం వెంటనే చెల్లిస్తామని ఇన్‌చార్జి ఏడీఏ సంపత్ చెప్పటంతో కోర్టు సిబ్బంది వెనుదిరిగారు.
మరిన్ని వార్తలు