కడలిపై విమాన కలకలం

16 Oct, 2016 11:00 IST|Sakshi

 టీ.నగర్: కన్యాకుమారి సముద్రంపై గుర్తు తెలియని విమానం చక్కర్లు కొట్టడంతో కలకలం చెలరేగింది. దీంతో పోలీసులు రాత్రంతా గస్తీ పనులలో నిమగ్నమయ్యారు. కన్యాకుమారి జిల్లాలోని ఆరోగ్యపురం నుంచి నీరోడి వరకు 45కు పైగా సముద్రతీర గ్రామాలున్నాయి. ప్రస్తుతం ఈ తీర గ్రామాలలో భద్రతను పెంచారు. కుళచ్ఛల్ నుంచి కోస్టుగార్డు పోలీసులు ఆధునిక పడవలలో ప్రతిరోజు గస్తీ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కన్యాకుమారి నుంచి కుళచ్ఛల్ వరకు గల తీర ప్రాంతాల్లో ఓ విమానం చక్కర్లు కొట్టింది.

దీనిపై ఆందోళన చెందిన  స్థానికులు వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయ కంట్రోల్ రూమ్‌కు సమాచారం తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న కన్యాకుమారి పోలీసులతో పాటు కుళచ్ఛల్ నుంచి కోస్టుగార్డు పోలీసులు కూడా వచ్చి తీర ప్రాంతాలలో గస్తీ తిరిగారు. ఈ విమానం మూడు గంటల సేపు ఆ ప్రాంతంలో పర్యటించినట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు గస్తీని పెంచారు. తీర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు సంచరించినట్లయితే వెంటనే తెలియచేయాలని పోలీసులు ప్రజలను కోరారు.
 

మరిన్ని వార్తలు