ఏడడుగులు కాదు.. ప్రమాణ స్వీకారం

18 Jun, 2019 08:01 IST|Sakshi
వధూవరులు చేత ప్రమాణం చేయిస్తున్న స్వామిజీ

పురోహితులు లేరు, మంత్రాలు లేవు.. కానీ వివాహమే

ఆంధ్ర అమ్మాయి, కన్నడ అబ్బాయి ఆదర్శ వివాహం

దొడ్డబళ్లాపురం : పెళ్లంటే ఏడడుగులు, జీలకర, బెల్లం, మంత్రాలు, మంగళవాద్యాలు ఇవన్నీ ఉండాల్సిందే... అయితే ఇవేవీ లేకుండా కేవలం ప్రమాణాలు చేయడం ద్వారా, మొక్కలు నాటి విభిన్నంగా ఆంధ్ర అమ్మాయి, కన్నడ అబ్బాయి వివాహం చేసుకున్న అపురూప సంఘటన సోమవారం చామరాజనగర తాలూకా హొండరబాళు గ్రామంలో చోటుచేసుకుంది. ఆనిమేటర్‌గా బెంగళూరులో పనిచేస్తున్న జేపీ నగర్‌ నివాసి జీఎన్‌ నరేంద్ర, దేవనహళ్లిలో స్థిరపడిన అనంతపురం జిల్లా ఆమిద్యాలకుంటకు చెందిన రమాదేవి, నారాయణస్వామి దంపతుల కుమార్తె కవితను వివాహం చేసుకున్నారు.

మొక్కలు నాటుతున్న వధూవరులు
కవిత ఎంటెక్‌ పూర్తి చేసింది. సోమవారం వీరి వివాహాన్ని నిడుమామిడి మహాసంస్థానం పీఠాధిపతి వీరభద్ర చన్నమల్ల స్వామిజీ నిరాడంబరంగా వివాహ ప్రమాణం చేయించారు. కేవలం ‘మేమిద్దరం వివాహం చేసుకుంటున్నాము. జీవితంలో ఎదురయ్యే సుఖ, దుఃఖాలలో కలిసి ఉంటామని, ఒకరికొకరు తోడుగా ఉంటామని’ ప్రమాణం చేయించారు. వివాహ కార్యక్రమానికి ప్రముఖ రైతుపర ఉద్యమనాయకుడు దివంగత ప్రొ.నంజుండ స్వామి కుమార్తె చుక్కినంజుండస్వామి, స్థానిక రైతు సంఘాల నాయకులు, మేధావులు హాజరయ్యారు. చివరగా వధూవరులు మొక్కలు నాటి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. 

మరిన్ని వార్తలు