కౌసల్య తల్లికి పోలీస్ కస్టడి

2 Apr, 2016 02:44 IST|Sakshi

 తిరువొత్తియూరు: ఉడుమలైకు చెందిన దళిత యువకుడు హత్య కేసులో కౌసల్య తల్లిని రెండు రోజులు పోలీసు కస్టడిలో ఉంచి విచారణ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఉడుమలై సమీపంలోని కుమరలింగంకు చెందిన వేలుస్వామి. ఇతని కుమారుడు శంకర్. దళిత కుటుంబానికి చెందిన ఇతను, పళణికి చెందిన చిన్నస్వామి కుమార్తె కౌసల్య  కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న కౌసల్య తల్లిదండ్రులు, బంధువులు ఆమెను బెదిరించినప్పటికీ శంకర్‌తో కలిసి కాపురం చేస్తున్నట్టు తెలిసింది.
 
 ఈ క్రమంలో 13వ తేదీ ఉడుమలై సెంట్రల్ బస్టాండ్ వద్ద ఈ ప్రేమజంటపై కిరాయి రౌడీలు కత్తులతో దాడి చేశారు. దాడిలో శంకర్ మృతి చెందాడు. తీవ్రగాయాలైన కౌసల్యను చికిత్స కోసం కోవై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి చిన్నస్వామి, కౌసల్య మామ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
 
  కౌసల్య తల్లి అన్నలక్ష్మి, తేని కోర్టులో లొంగిపోయింది. ఈమెను గురువారం ఉడుమలై కోర్టులో హాజరుపరిచారు. ఆమెను కస్టడిలోకి తీసుకుని విచారణ చేసేందుకు పోలీసులు కోర్టులో అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన మెజిస్ట్రేట్ అన్నలక్ష్మిని రెండు రోజులు పోలీసు కస్టడీలో ఉంచి విచారణ చేసేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

 

మరిన్ని వార్తలు