పోలీసు జాగిలాన్ని ఎత్తుకెళ్లారు!

7 Jan, 2016 08:28 IST|Sakshi
పోలీసు జాగిలాన్ని ఎత్తుకెళ్లారు!

చెన్నై, సాక్షి ప్రతినిధి: దొంగలను పట్టుకునేందుకు అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చిన ఓ పోలీసు జాగిలాన్ని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. తాంబరం రైల్వేపోలీస్ ఇన్‌స్పెక్టర్ శేఖర్ మేలుజాతి కుక్కకు భారతి అని పేరు పెట్టుకుని పెంచుకుంటున్నారు. విధి నిర్వహణలో ఎక్కడికి వెళ్లినా దీన్ని వెంటపెట్టుకుని దర్యాప్తు చేయడం ఆయనకు అలవాటు. రాత్రి గస్తీల్లో ఆ జాగిలం సేవలను తప్పకుండా ఉపయోగిస్తుంటారు. తాంబరం రైల్వేస్టేషన్లోని సిబ్బందికి ఆ జాగిలం బాగా అలవాటు.

రైల్వే ప్లాట్‌ఫాంపైకి బిచ్చగాళ్లు వచ్చినా, మందుబాబులు సంచరించినా తరిమివేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఈనెల ఒకటో తేదీన భారతిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు. అంత తొందరగా ఎవరికీ లొంగని ఈ జాగిలాన్ని కొత్తవాళ్లు పట్టుకెళ్లడం వీలు కాదని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. భారతి కనిపించకపోవడంతో ఇన్‌స్పెక్టర్ శేఖర్‌తో పాటు రైల్వే పోలీసులు కూడా బాగా డల్ అయ్యారు.

మరిన్ని వార్తలు