నెక్కొండ, న్యూస్లైన్ : రోడ్డు ప్రమాద ఘటన కు సంబంధించిన కేసులో రూ.5 వేలు లంచం తీసుకుంటూ గురువారం నెక్కొండలో ఎస్సై శ్రీదేవి, గన్మన్ వీరన్న ఏసీబీకి చిక్కారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. మండలంలోని సాయిరెడ్డిపల్లి గ్రామశివారు నర్సింహతండాకు చెందిన మాజీ సర్పంచ్ బానోతు హరిసింగ్నాయక్ కుమారుడు బానోతు వెంకన్న ఈ నెల 18న ట్రాక్టర్లో పత్తి లోడు చేసుకుని సాయిరెడ్డిపల్లి నుంచి నెక్కొండకు వస్తూ మార్గమధ్యంలో ఆటోను ఢీకొట్టాడు.
దీంతో ఆటో ముందు సీట్లో కూర్చున్న గొట్లకొండకు చెందిన భూక్య బిచ్చాకు కాలు విరిగింది. డ్రైవర్ వెంకన్నపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ పై బయటకు వచ్చిన వెంకన్న తన తండ్రి కలిసి వెళ్లి ట్రాక్టర్ ఇవ్వాలని ఎస్సై శ్రీదేవిని కలిశాడు. ఇందుకు ఆమె రూ.10 వేలు డిమాండ్ చేయగా, రూ.2 వేలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. చివరకు ైరూ.5 వేలు ఇస్తే ట్రాక్టర్ విడుదల చేసేందుకు ఎస్సై అంగీకరించారు. దీంతో చేసేదేమి లేక డబ్బులు చెల్లించలేక ఎస్సై అవినీతిపై వెంకన్న తండ్రి హరిసింగ్ నాయక్ ఏసీబీని ఆశ్రయించాడు.
గురువారం ఉదయం అతడు ఎస్సైకి రూ.5 వేలు ఇచ్చేందుకు పోలీస్స్టేషన్కు వెళ్లగా తన గన్మెన్ వీరన్నకు ఇవ్వమని ఆమె చెప్పారు. ఈ వ్యవహారాన్నంతటిని పర్యవేక్షిస్తున్న ఏసీబీ అధికారులు హరిసింగ్ నుంచి గన్మెన్ వీరన్న లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సై ఆదేశాలతో తాను డబ్బులు తీసుకున్నానని వీరన్న చెప్పడంతో వెంటనే ఎస్సైని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేిసి, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు సాంబయ్య, వెంకటేశ్వరరావు, రాఘవేంద్రరావు, లక్ష్మీ పాల్గొన్నారు.
ఎస్సై, కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు : డీఐజీ
వరంగల్క్రైం : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన నెక్కొండ ఎస్సై శ్రీదేవి, కానిస్టేబుల్ జి.వీరన్నను విధుల నుంచి తొలగిస్తూ డీఐజీ కాంతారావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు.