'ప్రత్యూష ప్రవర్తనలో మార్పు వచ్చింది'

5 Apr, 2016 11:54 IST|Sakshi
'ప్రత్యూష ప్రవర్తనలో మార్పు వచ్చింది'

ముంబై: బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ, ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ పలుమార్లు గొడవపడినట్టు సన్నిహితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. ఇద్దరికీ విబేధాలు రావడంతో నిత్యం గొడవపడేవారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు సాయపడ్డానని ప్రత్యూష తల్లి సోమా చెప్పింది. ముంబై బంగుర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని వెల్లడించింది.

'ప్రత్యూషకు, రాహుల్కు విబేధాలు వచ్చాక ఇద్దరూ విడిపోయారు. గొడవపడటం మానుకుని కెరీర్పై దృష్టిసారించాలని ఇద్దరికీ చెప్పాను' అని సోమా పోలీసులకు చెప్పింది. ప్రత్యూష ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తనకు తెలియదని, ఈ కేసును సమగ్రంగా విచారించాలని పోలీసులను కోరింది. రాహుల్తో నిరంతరం గొడవపడటం వల్ల ప్రత్యూష ప్రవర్తనలో మార్పు వచ్చిందని సోమా పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ప్రత్యూష్ చనిపోయేముందు ముంబైలోని కండివిలి ఫ్లాట్లో ఉండగా, తల్లిదండ్రులు అంబర్నాథ్లో నివాసం ఉంటున్నారు.

ప్రత్యూష, రాహుల్ల జాయింట్ బ్యాంక్ ఎకౌంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇద్దరి కాల్ రికార్డులను అధ్యయనం చేస్తున్నారు. కాగా ప్రత్యూష మరణించే సమయానికి రెండు నెలల గర్భవతి అని వచ్చిన వార్తలు అవాస్తవమని ఆమె సన్నిహితురాలు ఫాల్గుణి ఖండించారు. ఏప్రిల్ 1న ప్రత్యూష తన ఫ్లాట్లో మరణించిన సంగతి తెలిసిందే. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు