'మా అమ్మాయి బాయ్ఫ్రెండ్ బెదిరిస్తున్నాడు'

15 Apr, 2016 16:03 IST|Sakshi
'మా అమ్మాయి బాయ్ఫ్రెండ్ బెదిరిస్తున్నాడు'

ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జి బాయ్ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ తమను బెదిరిస్తున్నాడని ఆమె తల్లి సోమా బెనర్జీ ఆరోపించింది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి రాహులే కారణమని, ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులతో విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు లేఖ రాసింది.

'రాహుల్ మా అమ్మాయి ప్రత్యూషను మోసం చేయడమే కాదు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణమయ్యాడు. అతను అమాయికులైన కొందరు యువతులను మోసం చేసి డబ్బు తీసుకున్నాడు' అని సోమా మీడియా సమావేశంలో చెప్పింది. ఈ కేసును ముంబైలోని బంగుర్ నగర్ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలేదని ఆరోపించింది. సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి వీలుగా నిందితుడిని స్వేచ్ఛగా వదిలేశారని చెప్పింది. రాహుల్ తమతో పాటు ఇతర సాక్షులను బెదిరిస్తున్నాడని సీఎంకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రిని కోరింది.

ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు, సన్నిహితులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతికి రాహులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

>
మరిన్ని వార్తలు