రాచకొండ గుట్టల్లో బైక్ రేసింగ్

12 Sep, 2016 09:53 IST|Sakshi
రాచకొండ గుట్టల్లో బైక్ రేసింగ్

36 వాహనాలు స్వాధీనం
మంచాల: రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన రాచకొండ గుట్టల్లో బైక్ రేసింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. 36 బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎంఆర్‌ఎఫ్ మో గ్రీప్‌ర్యాలీ ఆఫ్ హైదరాబాద్ 2016 పేరుతో నేషనల్ ర్యాలీ చాంపియన్  షిప్ (బైక్ రేసింగ్) నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని మంచాల సీఐ గంగాధర్ తెలిపారు. తిప్పారుుగూడ-తాళ్లపల్లిగూడ, ముక్కునూర్ గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా రేసింగ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. అడవి ప్రాంతంలో రాత్రిపగలు పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. సీఐ గంగాధర్ ఎస్‌ఐ రాంబాబు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బైక్ రేసింగ్‌ను అడ్డుకున్నారు.

బైక్ రేసింగ్‌కు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉండగా, ఎలాంటి అనుమతులు తీసుకోలేదని గంగాధర్ తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 53 మంది ఈ రేసింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. ఇప్పటికే నాలుగు రౌండ్ల పోటీలు పూర్తయ్యాయని, ఒక రౌండ్ మాత్రమే మిగిలి ఉందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. బైక్ రేసింగ్‌లో ఐదుగురు యువతులు కూడా ఉన్నారు. రేసింగ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు