ధ్యానం కోసమే రాజ్‌ఘాట్‌కు..

13 Apr, 2014 23:51 IST|Sakshi

న్యూఢిల్లీ: తాను రాజ్‌ఘాట్‌కు వెళ్లింది కేవలం మెడిటేషన్ కోసమే కానీ ఎలాంటి బహిరంగ సభకు కాదన్నారు ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్. అనుమతులు లేకుండా సమావేశం నిర్వహించారన్న ఎన్నికల సంఘం నోటీసులకు పైవిధంగా సమాధానమిచ్చారాయన. ఏప్రిల్ 8న తాను పార్టీ నేతలతో కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లింది మెడిటేషన్, ఆత్మపరిశీలనకోసమేనన్నారు కేజ్రీవాల్. అక్కడ ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు కానీ, బహిరంగ సభగానీ నిర్వహించలేదని ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మంగళవారం కేజ్రీవాల్ సమావేశం నిర్వహించారని ఎన్నికల సంఘం బుధవారం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు అతని వివరణ విశ్లేషించినతరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
 
 వాయవ్య ఢిల్లీలో సుల్తాన్‌పురీలో రోడ్‌షో నిర్వహిస్తుండగా ఓ ఆటోరిక్షా డ్రైవర్ కేజ్రీవాల్‌ను చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనతో నిశ్చేష్టుడైన కేజ్రీవాల్ పార్టీ క్యాడర్‌తో కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లి ఒక గంటపాటు మౌనంగా కూర్చున్నారు. దీంతో వివరణ కోరుతూ తూర్పు డిప్యూటీ ఎన్నికల సంఘం అధికారి నిహారికా రాయ్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆప్ సభ్యులు స్పందిస్తూ కేజ్రీవాల్ రాజ్‌ఘాట్ దగ్గరికి ఓ సామాన్యవ్యక్తిగా వెళ్లారే తప్ప రాజకీయ నాయకునిగా కాదని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే తనపై దాడి చేసిన డ్రైవర్ లాలీ ఇంటికి వెళ్లి కేజ్రీవాల్ అతనితో మాట్లాడాడు. ప్రభుత్వం నుంచి వైదొలగినందుకు ఆగ్రహంతో కొట్టానని అతడు వివరణ ఇచ్చాడు. ఇందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
 

>
మరిన్ని వార్తలు