వాళ్లిద్దరూ.. రాజకీయాల్లోకొచ్చినా భయం లేదు

25 Jul, 2017 08:11 IST|Sakshi
వారు రాజకీయాల్లోకొచ్చినా భయం లేదు

పెరంబూరు: రజనీకాంత్, కమలహాసన్‌ రాజకీయాల్లోకొచ్చినా మాకేం భయం లేదు అని డీఎం డీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్‌ అన్నారు. పుదుగై జిల్లా, నెడువాసల్‌ గ్రామప్రజలు తమ ప్రాంతంలో హైడ్రోకార్బన్‌ పథకానికి వ్యతిరేకంగా గత ఏప్రిల్‌ 12 నుంచి పోరాటాలు చేస్తున్నారు. వారికి మద్దతు తెలపడానికి ఆదివారం డీఎండీకే నేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత ఆ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయకాంత్‌ మాట్లాడుతూ ప్రాణాలొడ్డి అయినా  హైడ్రోకార్బన్‌ పథకాన్ని అడ్డుకుంటా మన్నారు.

సోమవారం ఆ గ్రామంలో హైడ్రోకార్బన్‌ పథకం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించిన విజయకాంత్‌ ఈ పథకాన్ని నిలిపి వేసేలా అవసరం అయితే రాష్ట్ర, కేంద్ర మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అదే విధంగా రజనీకాంత్, కమలహాసన్‌ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రస్తావిస్తూ, వారు రాజకీయల్లోకి వచ్చినా తమకు భయం లేదని వ్యాఖ్యానించారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయరంగ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు ఆశిస్తుండటంతో పాటు, ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా నటుడు కమలహాసన్‌ అన్నాడీఎంకే నేతలపై అవినీత అస్త్రాలను సంధిస్తున్నారు. దీంతో తమిళనాడు భవిష్యత్తు రాజకీయాలు ఎటు దారి తీస్తాయోనన్న ఆసక్తి నెలకొంది.

>
మరిన్ని వార్తలు