నేను రె‘ఢీ’

29 Nov, 2014 02:06 IST|Sakshi
నేను రె‘ఢీ’

‘అసెంబ్లీకి వచ్చేందుకు నేను రెడీ..ధైర్యముంటే నా కోసం ప్రత్యేకంగా సీటు వేయించు’ అంటూ ముఖ్యమంత్రికి డీఎంకే అధినేత కరుణానిధి సవాల్ విసిరారు. పెద్ద పెద్ద నాయకుల్నే చూశానని, తన గుండె ధైర్యం చూస్తే తట్టుకోలేవని, దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
     
* ధైర్యముంటే సీటు వేరుుంచు
* పన్నీరుకు కరుణ సవాల్
* దిగజారొద్దని హితవు

సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి వయోభారంతో వీల్‌ఛైర్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీతో సిద్ధం చేసిన వీల్ ఛైర్‌లో కూర్చునే ఆయన ఎక్కడికైనా వెళతారు. అలాంటి కరుణానిధికి అసెంబ్లీలో సమస్య ఎదురైంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక జార్జ్‌కోటను అసెంబ్లీగా ఎంపిక చేసుకుంది. అక్కడ కరుణ వీల్ ఛైర్ వెళ్లే విధంగా ఏర్పాట్లు లేదు. ఆ ఛైర్‌లో అసెంబ్లీలో కూర్చునేంతగా స్థలం లేదు. ప్రధాన ప్రతిపక్షం డీఎండీకేకు వెనుక డీఎంకే సభ్యులకు సీట్లు కేటాయించారు. తాను అసెంబ్లీకి వచ్చేందుకు ప్రత్యేక సీటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని పలుమార్లు కరుణానిధి కోరారు.

అయితే స్పందన లేదు. దీంతో అసెంబ్లీ సమా వేశాలు జరిగేటప్పుడు ఏదో ఒక రోజు వచ్చి సంతకం పెట్టి వెనుదిరగడం కరుణానిధికి పరిపాటిగా మారింది. అయితే పన్నీరు సెల్వాన్ని ఉద్దేశించి కరుణానిధి వ్యాఖ్యలు చేయడం, ఇందుకు దీటుగా పన్నీరు బదులివ్వడం ఇటీవల చోటు చేసుకుంది. ధైర్యముంటే అసెంబ్లీలో అడుగు పెట్టు అని పన్నీరు సెల్వం విసిరిన సవాలును తిప్పికొట్టే విధంగా శుక్రవారం కరుణానిధి స్పందించారు.
 
సీటు వేయించు: అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు తాను సిద్ధమని కరుణానిధి స్పష్టం చేశారు. అయితే తనకు ప్రత్యేక సీటును ముందు వరుసలో వేయించాలని, అందుకు తగ్గ ధైర్యం ఉందా..? అని సీఎం పన్నీరు సెల్వానికి సవాల్ విసిరారు. ప్రజా సమస్యల్ని ఎత్తి చూపే బాధ్యత ప్రతి పక్షానికి ఉందన్నారు. లోపాలను సరిదిద్దుకోవాల్సిన పన్నీరు సెల్వం తనకే నీతులు చెప్పేంతగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హెచ్చరించారు. అసెంబ్లీలో తాను సంధించే ప్రశ్నలకు మహా మహులే సమాధానాలు ఇవ్వలేక తడపడ్డ సందర్భాల ఉన్నాయని, ఇక తమరు ఎంత అని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఎంజీ.రామచంద్రన్ మరుసటి రోజు వచ్చి తనకు సమాధానాలు ఇచ్చేవారని, తాను మహామహుల్ని చూశానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతతో, హుందాగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలని, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే సహించబోనని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు