బెంగళూరు(బనశంకరి) రాజకాలువలపై నెలకొన్న అక్రమకట్టడాలను బీబీఎంపీ అధికారులు నేలమట్టం చేశారు. సుమనహళ్లి ప్లైఓవర్ సమీపంలో వెళ్లే వృషబావతి రాజకాలువ వెడల్పు 66 అడుగులుండగా అందులో 40 అడుగులు మేర కాలువను కొందరు కబ్జాదారులు ఆక్రమించుకుని భవనాలు, పారిశ్రామికషెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చారు. సుమారు ఒక కిలోమీటరు పొడవు ఉన్న రాజకాలువ లో 8 షెడ్లుతో పాటు 22 కట్టడాలను నిర్మించారు.
సోమవారం భారీ పోలీస్భద్రత మద్య పాలికె జాయింట్కమిషనర్ యతీశ్కుమార్, పాలికె ప్రధాన ఇంజనీర్ సిద్దేగౌడ నేతృత్వంలో రెండు జేసీబీ యంత్రాల సాయంతో బీబీఎంపీ సిబ్బంది అక్రమాలను నేలమట్టం చేశారు. గోవిందరాజనగర నియోజకవర్గంలోని కావేరిపుర సర్వేనెంబరు 6,7,8,9 లో 20 స్ధలాలు కబ్జాకు గురైనట్లు ఇటీవల సర్వేఅధికారులు నిర్వహించిన సర్వేలో వెలుగుచూడటంతో వాటిని కూడా తొలగించారు.
ఈ సందర్భంగా పాలికె ఇంజనీర్ సిద్దేగౌడ మాట్లాడుతూ రాజకాలువలను ఆక్రమించి కట్టడాలు, భవనాలు నిర్మించిన వాటిని నిర్ధాక్షిణంగా తొలగిస్తామని ఇప్పటికే కబ్జాకు గురైన 22 ఆస్తులను నేలమట్టం చేశారు. పారిశ్రామిక షెడ్లు నిర్మించిన వారు కొద్దిరోజులు వ్యవధి అడగడంతో వారికి సమయం ఇచ్చామన్నారు. మైసూరురోడ్డు వరకు రాజకాలువపై నెలకొన్న అక్రమాలను తొలగిస్తామని సహకరించని వారిపై క్రిమినల్ కేస్ నమోదు చేయాలని బీఎంటీఫ్ పోలీసులకు సూచించామని తెలిపారు.