ఆ పార్టీల నిధులపై కన్ను

22 Dec, 2016 03:19 IST|Sakshi

ఆదాయపన్ను శాఖను కోరిన ఎన్నికల కమిషన్‌
పోటీకి దూరంగా ఉన్న 200 పార్టీలపై దృష్టి


న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్న సుమారు 200 రాజకీయ పార్టీల నిధులపై కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీ) దృష్టి సారించింది. కాగితాలకే పరిమితమైన ఈ పార్టీలు మనీలాండరిం గ్‌కు సహకరిస్తున్నట్టుగా అనుమానిస్తున్న ఈసీ.. వీటికి అందిన నిధులపై ఓ కన్నేయాలని కోరుతూ ఆదాయపన్ను శాఖకు తాజాగా లేఖ రాసింది. ఈ పార్టీలు నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు సహ కారం అందించినట్టుగా ఈసీ అనుమాని స్తోంది. వీటిలో చాలా పార్టీలు కాగితాలకే పరిమితమయ్యాయని, ఇవి విరాళాల రూపంలో నల్లధనాన్ని స్వీకరించి తెల్లగా మారుస్తూ కొందరికి సహకరిస్తున్నా యని భావిస్తోంది.

2005 నుంచి ఎన్నికల్లో పోటీ చేయని సుమారు 200 రాజకీయ పార్టీలను ఎన్నికల కమిషన్‌ జాబితా నుంచి తొలగించింది. కొద్ది రోజుల్లో పార్టీల జాబితాను ఆదాయపన్ను శాఖ వర్గాలకు అందజేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ఏడు (బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, తృణమూల్, సీపీఐ, సీపీఎం, ఎన్‌సీపీ) జాతీయ పార్టీలు, 58 ప్రాంతీయ పార్టీలు, మరో 1780 రిజిస్టర్‌ అయినా గుర్తింపు పొందని పార్టీలు ఉన్నాయి.

20 వేలకు మించినవి రూ.102 కోట్లు
జాతీయ పార్టీలకు 2015–16లో రూ.20 వేలకు మించిన విరాళాలు సుమారు రూ.102 కోట్లు వచ్చాయని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఇందులో బీజేపీకి అత్యధికంగా 613 విరాళాల నుంచి రూ.76.85 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 918 విరాళాల రూపంలో రూ.20.42 కోట్లు సమకూరాయి. ఈ నివేదికను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) రాజకీయ పార్టీలు ఈసీకి అందజేసిన డిక్లరేషన్ల ఆధారంగా రూపొందించాయి.

మరిన్ని వార్తలు