విజయవాడ: నగరంలో పుష్కరాల సందర్భంగా వేసిన రోడ్ల నాణ్యత క్రమంగా బయటపడుతోంది. నెల రోజుల క్రితం వన్ టౌన్ చేపల మార్కెట్ సమీపంలో రోడ్ రెండు అడుగుల లోతుకు కుంగిపోయిన ఘటన మరువకముందే వన్ టౌన్ వాగు సెంటర్లో నిన్న అర్ధరాత్రి రోడ్ మద్యలో రెండు అడుగుల గొయ్యి పడింది. నిత్యం రద్దీగా వుండే ఈ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో రోడ్డు కుంగిపోవడంతో వాహనదారులు కంగారు పడ్డారు.
వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి గొయ్యి పడిన చోట బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పక్కకు మళ్ళించారు. అయితే రోడ్ కుంగిన ప్రాంతంలో డివైడర్ పక్కన కూడా సన్నటి బీటలు కనిపిస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు కుంగిన రోడ్ను పరిశీలిస్తున్నారు. కుంగిపోయిన ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి లీక్ వల్ల మట్టి మెత్తబడి గొయ్యి ఏర్పడి వుంటుందని అనుమానిస్తున్నారు.