-

వెళ్లొస్తా

1 Sep, 2016 02:08 IST|Sakshi
వెళ్లొస్తా

తమిళనాడు గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య ఐదేళ్ల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. ఆ బాధ్యతల్ని అందుకునేందుకు మరో తెలుగు గవర్నర్ సిద్ధమయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్ రావుకు తమిళనాడు గవర్నర్ బాధ్యతలు అదనంగా అప్పగిస్తూ రాష్ర్టపతి భవనం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
 
సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా అందరి మన్ననల్ని అందుకున్న కొణిజేటి రోశయ్య, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం అనూహ్యంగా సీఎం పదవిని అధిరోహించారు. అక్కడి కాంగ్రెస్ రాజకీయ పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరైన ఆయన 2011 జూన్‌లో పదవికి అధిష్టానం ఆదేశాలతో రాజీనామా చేశారు. తలపండిన నేతను గౌరవించుకునే విధంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం రోశయ్యను తమిళనాడు గవర్నర్‌గా ఆగస్టు 26న నియమించింది. ఆయన నియామకంతో ఇక్కడి తెలుగు వారిలో ఆనందం వికసించింది.
 
అదే ఏడాది ఆగస్టు 31న ఆయన బాధ్యతలు స్వీకరించినానంతరం తమిళనాట ఉన్న తెలుగు వారికి రాజ్‌భవన్ ప్రవేశం ఎంతో సులభతరం అయిందని చెప్పవచ్చు. తమిళులకు గౌరవాన్ని ఇస్తూనే, తెలుగువారు పిలిస్తే పలికే గవర్నర్‌గా పేరు గడించారు. తెలుగు వారి కార్యక్రమాలు తన సొంత కార్యక్రమంగా భావించి ముఖ్యఅతిథిగా హాజరవుతూ, తనకు ఉన్న అధికారాల మేరకు ఐదేళ్లుగవర్నర్ పదవికి న్యాయం చేశారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రోశయ్య పదవికి మాత్రం ఎలాంటి ఢోకా రాలేదు.
 
 ఇందుకు కారణం, తమిళనాడు ప్రభుత్వంతో ఆయన సన్నిహితంగా మెలగడమేనని చెప్పవచ్చు. ఈ సన్నిహితమే మళ్లీ ఆయన పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు చోటు చేసుకున్నా, ఆయన పదవీ కాలంలో చివరి రోజైన బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు రాష్ర్టపతి భవన్ నుంచి ఇక సేవలకు సెలవు అన్నట్టుగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
 
 ఇక సెలవు
 ఐదేళ్ల పాటు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే, ఆయన స్థానంలో పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరగలేదు. కర్ణాటకకు చెందిన శంకరయ్య, గుజరాత్‌కు చెందిన ఆనందిబెన్ పటేల్ పేర్లు వినిపించినా, చివరకు ఇన్‌చార్జ్ గవర్నర్ నియమించబడ్డారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులు రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడ్డాయి. ఇన్‌చార్జ్‌గా రాబోతున్న గవర్నర్ కూడా తెలుగు వారు కావడం విశేషం. ఆయనే మహారాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావు.  కరీంనగర్‌లో జన్మించిన ఆయన ఆది నుంచి బీజేపీలో తన సేవల్ని అందిస్తూ వచ్చారు. 1985 నుంచి 1998 వరకు ఎమ్మెల్యేగా, 1999లో ఎంపీగా గెలిచిన విద్యాసాగర్ రావు, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విద్యాసాగర్ రావు చెన్నైకు వచ్చి ఇన్‌చార్జ్ గవర్నర్ బాధ్యతల్ని ఒకటి రెండు రోజుల్లో స్వీకరించే అవకాశం ఉంది. ఆయనకు తన బాధ్యతల్ని అప్పగించి రోశయ్య ఆ పదవి నుంచి తప్పుకుంటారు.
 

మరిన్ని వార్తలు