ప్రయాణికురాలిని కాపాడిన ఆర్‌పీఎఫ్‌ పోలీసు

30 Jun, 2018 06:58 IST|Sakshi
రైలు నుంచి కింద పడుతున్న మహిళను కాపాడుతున్న రైల్వే పోలీసు

తిరువొత్తియూరు: సెంట్రల్‌రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కిన సమయంలో అదుపు తప్పి కింద పడిన మహిళను కాపాడిన రైల్వే పోలీసు(ఆర్‌పీఎఫ్‌)ను అధికారులు అభినందించారు. చెన్నై మేడవాక్కంకు చెందిన సంపత్‌కుమార్‌. ఇతని భార్య ప్రియ (28), తల్లితో కలిసి కోవై వెళ్లడానికి గురువారం రాత్రి చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. వీరు 6వ ప్లాట్‌ఫారం వద్దకు వస్తున్నారు. అప్పుడు కోవైకు వెళ్లడానికి వారు రిజర్వేషన్‌ చేసుకున్న ఆలపుళా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్లాట్‌ఫాం నుంచి కదులుతోంది.

ఇది చూసిన ప్రియ, తల్లితో కలిసి పరిగెత్తి వెళ్లి రైలు ఎక్కడానికి ప్రయత్నించింది. ప్రియ అదుపు తప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్య పడిబోయింది. గమనించిన రైల్వే భద్రతా పోలీసు పాండియరాజన్‌ అక్కడికి వెళ్లి కింద పడిన మహిళను కాపాడాడు. ఘటనలో ప్రియకు స్పల్ప గాయాలయ్యాయి. రైల్వే పోలీసుల పాండియరాజన్‌కు ప్రియ, ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు పాండియరాజన్‌ను అభినందించారు.

మరిన్ని వార్తలు