రూ. 4వేల కోట్లతో విద్యుత్ కొనుగోలు

1 Sep, 2015 02:26 IST|Sakshi

బెంగళూరు: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడుతోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ వెల్లడించారు. అయితే విద్యుత్ కోతలను నివారించేందుకు గాను ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. సోమవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను నివారించేందుకు గాను రూ.4వేల కోట్లతో విద్యుత్‌ను ఖరీదు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 780 మెగావాట్‌ల విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. ఇక సెంట్రల్ బ్రిడ్ నుంచి విద్యుత్‌ను అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం సమ్మతించిందని చెప్పారు. విద్యుత్ కొరత నివారణకు అవసరమైన అన్ని ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని డి.కె.శివకుమార్ వెల్లడించారు.

 కాంగ్రెస్ వైపు జేడీఎస్ మొగ్గు
 సాక్షి, బెంగళూరు : బీబీఎంపీ మేయర్ ఎంపిక విషయంలో కాంగ్రెస్‌తో మైత్రి కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ర్ట జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. బెంగళూరును సమగ్రాభివృద్ధి చేయడంలో భాగంగా జేడీఎస్ నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే జబీర్ అహమ్మద్ ఖాన్ అతిథి గృహంలో జేడీఎస్ ముఖ్య నాయకులతో సోమవారం నిర్వహించిన ప్రధాన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఎవరైనా సంప్రదిస్తే మైత్రి కుదుర్చుకునేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
 
 

మరిన్ని వార్తలు