'ఆర్టీసీ బకాయిలను విడుదల చేయాలి'

4 Oct, 2016 11:40 IST|Sakshi
ఒంగోలు : ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఒంగోలు డిపో కార్యదర్శి జి.మాధవరావు డిమాండ్‌ చేశారు. స్థానిక బస్టాండ్‌ ఆవరణలో ఎస్‌డబ్లూ్యఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఆర్టీసీ నష్టాలకు కారణం ప్రభుత్వ చర్యలేనన్నారు. అక్రమ రవాణాద్వారా ఆర్టీసీకి ఏడాదికి 2 వేల కోట్ల నష్టం వాటిల్లుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆర్టీసీకి డీజిల్‌పై టాక్స్‌ రద్దుచేయాలని, మోటార్‌ వెహికల్‌ ట్యాక్స్‌కు కనీసం 5 సంవత్సరాలు హాలిడే ప్రకటించాలన్నారు. టోల్‌గేట్‌ ఫీజు, వ్యాట్‌టాక్స్‌ మినహాయింపులు ఇచ్చి ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. నష్టాల పేరుతో గ్రామీణ ప్రాంత సర్వీసులు రద్దుచేయడం మానుకోవాలన్నారు.

పనిభారం పెంపు పేరుతో ఇప్పటికే ప్రకాశం రీజియన్‌లో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, చిత్తూరు రీజియన్‌కు డిప్యుటేషన్‌పై పంపిన కార్మికులను ప్రకాశం రీజియన్‌కు పిలిపించాలని కోరారు. అధికారులు కూడా దుబారా ఖర్చు తగ్గించుకొని ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజనల్‌ నాయకులు ఎస్‌కే మీరావలి, వీఎన్‌రెడ్డి, ఎస్‌కే మాబు, బి.వెంకట్రావు, ఎస్‌పి విజయ్‌కుమార్, షేక్‌ కబీర్, సీహెచ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు