అర్హులకే ఆర్టీఈ

9 Jan, 2014 05:06 IST|Sakshi

 = సర్కార్ యోచన..
 = తప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో సీట్లు అక్రమార్కుల పాలు
 = ఇక ప్రవేశానికి బీపీఎల్ కార్డుతో లింక్
 = సీఎంతో చర్చించి తుది నిర్ణయం:  మంత్రి కిమ్మనె రత్నాకర్

 
సాక్షి, బెంగళూరు : విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేటు పాఠశాలల్లో చేరదలచిన విద్యార్థుల కుటుంబాలకు విధిగా బీపీఎల్ కార్డు ఉండాలన్న షరతు విధించాలని యోచిస్తున్నట్లు పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తెలిపారు. ఇక్కడి కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో కొందరు తమ పిల్లలకు ఆర్టీఈ కింద సీటు సంపాదిస్తుండటం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.

దీనిని నివారించడానికి, నిజమైన పేదలకు న్యాయం జరగడానికి బీపీఎల్ కార్డు నిబంధన విధించాలనుకుంటున్నామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీఈ  అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు  ఇతర విద్యార్థుల ఫీజులు పెంచినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై చర్యలు చేపడతామన్నారు.

ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, మైనారిటీ విద్యా సంస్థలు ఆర్టీఈ కింద విధిగా 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలన్నారు. అలా కేటాయించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే విద్యా సంవత్సరం  నుంచి జూన్ 1నే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారం, సైకిళ్లను  అందజేస్తామన్నారు. దీనిపై వాయిదాలు ఉండబోవని ఆయన భరోసా ఇచ్చారు.  
 

మరిన్ని వార్తలు