గవర్నర్ పదవి నుంచి షీలాదీక్షిత్‌ను తప్పించండి

2 Aug, 2014 22:40 IST|Sakshi

 న్యూఢిల్లీ: పార్లమెంట్‌కు కాగ్ శుక్రవారం సమర్పించిన నివేదికలో షీలాదీక్షిత్ హయాంలో అనేక అక్రమాలు జరిగినట్టు ఆరోపించిన నేపథ్యంలో ఆమెను కేరళ గవర్నర్ పదవి నుంచి తప్పించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిమాండ్ చేసింది. షీలాదీక్షిత్ ముఖ్యమంత్రి పదవిలో ఉండగా వివిధ శాఖలు నిధుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డాయని కాగ్ తన నివేదికలో పేర్కొందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆశుతోశ్ పేర్కొన్నారు.
 
 895 అనధికార కాలనీల్లో  మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, నీటి పైప్‌లైన్లు, రహదారులు తదితర మౌలిక వసతుల కల్పన పేరిట షీలా ప్రభుత ్వం దాదాపు రూ. 3,000 కోట్ల నిధులను వెచ్చించిందన్నారు. అందులో అనేక అక్రమాలు జరిగినట్టు కాగ్ పేర్కొందన్నారు. 895 అనధికార కాలనీల్లో మురుగునీటి పారుదల వ్యవస్థే లేదని కాగ్ తన నివేదికలో పేర్కొందని, అయితే అందులోని సగం కాలనీలకు ఈ వసతులే లేవని, మరిఅలాంటప్పుడు నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. అందువల్ల ఆమెను కేరళ గవర్నర్ పదవినుంచి తప్పించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. అంతేకాకుండా షీలా ప్రభుత్వంలోని మంత్రులందరిపైనా కేసులు నమోదు చేయించి, ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
 
 కాగా ఢిల్లీ ప్రభుత్వ విభాగాల్లో అవకతవకలతోపాటు, ఆర్థిక పారదర్శకత లేమి కారణంగానే సర్కారు రాబడి గణనీయంగా పడిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) శుక్రవారం తన నివేదికలో పేర్కొన్న సంగతి విదితమే. ఈ నివేదికను ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాణిజ్యం, పన్నులు, రాష్ట్ర ఎక్సైజ్, రవాణా తదితర శాఖలకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశామని, దాదాపు రూ. 2,041 కోట్ల మేర ప్రభుత్వం నష్టపోయినట్టు ఆయా ఫైళ్ల తనిఖీలో తేలిందని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు