ఇంటికి చేరిన నావికుడు

21 Dec, 2013 00:15 IST|Sakshi

ముంబై: టోగో నిర్బం ధంలో ఉన్న భారతీయ నావికుడు సునీల్ జేమ్స్ శుక్రవారం కుటుంబాన్ని చేరుకున్నాడు. ఐదు నెలలుగా ఇంటికి దూ రంగా ఉన్న జేమ్స్‌ను ఇంటికి చేరగానే విషాదమే పలకరించింది. ఈ నెల రెండో తేదీన ఆయన 11 నెలల కుమారుడు మరణించాడు. ఈ పరిస్థితిలో అతని విడుదల కోసం ప్రభుత్వం మీద వివిధ మార్గాల్లో ఒత్తిడి తెచ్చారు. జేమ్స్ భార్య అదితి... ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా కలసి తన భర్తను విడుదల చేయించాల్సిందిగా ప్రార్థించింది. చివరికి జేమ్స్‌ను టోగో ప్రభుత్వం విడుదల చేసింది.
 
 ‘నిర్బంధంలో ఉన్నప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు తండ్రిగా నా విధిని నిర్వహించాల్సిన పరిస్థితి. దయచేసి అర్థం చేసుకొని వదలిపెట్టండి’ అని ఎయిర్‌పోర్టులో అతన్ని కలిసిన మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశాడు. ప్రధాని కార్యాలయం, టోగో అధ్యక్షుల జోక్యంతోనే తనకు స్వేచ్ఛ లభించిందన్నాడు. కెప్టెన్ జేమ్స్ నాయకత్వం వహించిన మార్షల్ దీవులకు చెందిన ఎంటీ ఓషన్ షిప్‌ను దోచుకోవడానికి పైరేట్లకు సహకరించాడనే ఆరోపణతో జూలై 16న టోగో అధికారులు అరెస్టు చేశారు.డిసెంబర్ 2న గాంగ్రీన్‌తో మరణించిన జేమ్స్ కుమారుడి అంత్యక్రియలను నిర్వహించకుండా అతని రాక కోసం కుటుంబం ఎదురుచూసింది. జేమ్స్ ఇంటికి చేరినందున వివాన్ అంత్యక్రియలను నిర్వహించనున్నారని సన్నిహితులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు