‘పవర్’ పోరు షురూ!

13 Jan, 2014 23:32 IST|Sakshi

 సాక్షి, ముంబై: ముందుగా హెచ్చరించినట్లుగానే దక్షిణ ముంబై పార్లమెంట్ సభ్యుడు సంజయ్ నిరుపమ్ కాందీవలిలోని రిలయన్స్ ఎనర్జీ కార్యాలయం ముందు సోమవారం ఆందోళనకు దిగారు. ఆయనకు ఎంపీ ప్రియాదత్ కూడా మద్దతు పలికారు. విద్యుత్ టారిఫ్‌ను తగ్గించకపోతే ఆందోళనకు దిగుతామని వారంరోజుల క్రితం నిరుపమ్ హెచ్చరించిన విషయం తెలి సిందే. తగ్గించేవరకు కార్యాలయం ముందునుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొన్న ఈ ఆందోళనలో నిరుపమ్ ప్రసంగిస్తూ... ‘విద్యుత్ టారిఫ్‌ను తగ్గిస్తూ రిలయన్స్ కంపెనీ ప్రక టన చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదు. మొండికేస్తే మా పార్టీ ఎంపీలు నిరవధిక నిరాహార దీక్షకు దిగుతార’ని హెచ్చరించారు. రిలయన్స్ కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీని ‘దొంగ’ అంటూ నినాదాలు చేశారు. గతంలోనే ఈ విషయమై సంజయ్ నిరుపమ్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు లేఖ రాశారు.
 
 ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ చార్జీలను తగ్గించినప్పుడు ముంబై లోకూడా ఎందుకు తగ్గించకూడదని లేఖలో ప్రశ్నించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రిలయన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి కూడా నిరుపమ్ లేఖ రాశారు. టారిఫ్ తగ్గించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కాగా ఇరువురి నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో నిరుపమ్ ఆందోళనబాట పట్టారు. ఫిక్స్‌డ్ చార్జీలు, ఆస్తుల క్రమబద్ధీకరణ పేరుతో వసూలు చేస్తున్న చార్జీల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఎంపీ ప్రియాద త్ మాట్లాడుతూ... ముంబై, శివారు ప్రాంతాలకు ఏకీకృత టారిఫ్ విధానముండాలన్నారు. టారిఫ్‌ను తగ్గించకపోతే ఆందోళన మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు.
 
 తమ పార్టీ నేతలందరు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటారని, అంతవరకు పోకుండా ముందుగానే టారిఫ్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా నారాయణ్ రాణే నేతృత్వంలోని కాంగ్రెస్ మంత్రుల బృందం కూడా ఈ విషయంపై స్పందించింది. 10 నుంచి 20 శాతం టారిఫ్‌ను తగ్గించాలంటూ మంత్రుల బృందం డిమాండ్ చేసింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతున్న పేదలకు  విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారాయని, చార్జీలు తగ్గించాలని గత వారం కిందట శివసేన నేత అనిల్ పరబ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది వినియోగదారుల బిల్లులు తగ్గించాలని రిలయన్స్ ఎనర్జీ కంపెనీని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ధర్నా, ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పడు అదే బాట కాంగ్రెస్ నాయకులు పట్టారు.
 
 ఆప్‌ను అడ్డుకునేందుకే..!
 ఢిల్లీలో ప్రారంభించినట్లుగానే ముంబైలో కూడా విద్యుత్ ఉద్యమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ ప్రారంభిస్తుందోనన్న భయంతోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ ఆందోళనకు దిగినట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణపై కన్నేసిన ఆప్ పుణే, ముంబైలలో ఇప్పటికే పార్టీ కార్యకలాపాలను వేగం చేసింది. దీంతో ఆ పార్టీ కంటే ఓ అడుగు ముందేసి విద్యుత్ చార్జీలను తగ్గించిన ఘనత తమ పార్టీకే దక్కాలని కాంగ్రెస్ నేతలు ఈ వ్యూహం అమలు చేసినట్లుగా చెబుతున్నారు. అందులోభాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులే పోరాట ం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఆందోళన తర్వాత ఆప్ ఉద్యమాన్ని ప్రారంభించినా ఆ పార్టీకి కీర్తి దక్కకుండా చేయడమే కాంగ్రెస్ నేతల వ్యూహంగా భావిస్తున్నారు.
 
 ఎంఆర్‌ఈసీ చట్టం-2003 ప్రకారమే..
 రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్‌ను మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ చట్టం-2003 ప్రకారమే వసూలు చేస్తున్నట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రకటించింది. టారిఫ్‌పై నిర్ణయాన్ని ఎంఆర్‌ఈసీకే వదిలేయాలని సుప్రీం కోర్టు కూడా ప్రకటించిందని, ఈ విషయంలో దేశ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోలేవని ఆ కంపెనీ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు