నరేంద్ర మోడీకి ఏడంచెల భద్రత

22 Dec, 2013 00:23 IST|Sakshi

ముంబై: నగరంలో ఆదివారం జరగనున్న సభకు హాజరవుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పోలీసు శాఖ ఏడంచెల భద్రత కల్పించనుంది. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. మోడీకి పటిష్టమైన భద్రత కల్పించామన్నారు. సభ జరగనున్న ఎంఎంఆర్‌డీఏ మైదానంతోపాటు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో మూడు వేలమంది పోలీసు సిబ్బందిని మోహరించామన్నారు. మోడీకి పెనుముప్పు పొంచిఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఆయనకు ఏడంచెల భద్రత కల్పిస్తున్నామన్నారు.
 
 భద్రతా విధుల్లో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) కూడా పాలుపంచుకుంటుందన్నారు. 30 రోజుల కంటే ముందు నగరానికి వచ్చి, ఇక్కడ ఉంటున్నవారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. వేదిక సమీపంలోని మార్గాల్లో నాకాబందీలు నిర్వహిస్తున్నామన్నారు. సభా ప్రాంగణంలో ప్రవేశించే ప్రతి ఒక్కరినీ రెండు పర్యాయాలు తమ సిబ్బంది తనిఖీ చేస్తారన్నారు. ఆత్మాహుతి దళాల ముప్పు అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే సత్వర స్పందన బృందాలను (క్యూఆర్‌టీ)లను రంగంలోకి దించామన్నారు. వీరితోపాటు బాంబు స్క్వాడ్ బృందాలు వేదిక సమీపంలో విస్తృతంగా తనిఖీలు చేస్తారన్నారు. కాగా మోడీ సభలో బీజేపీ నాయకులు రాజ్‌నాథ్ సింగ్, రాజీవ్ ప్రతాప్‌రూడీ, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొంటారు.  
 

మరిన్ని వార్తలు