బీజేపీ వైపు జనం చూపు

26 Mar, 2016 03:07 IST|Sakshi
బీజేపీ వైపు జనం చూపు

 సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో జనం విసిగిపోయి బీజేపీ వైపు చూస్తున్నారని బళ్లారి లోక్‌సభ సభ్యుడు బీ.శ్రీరాములు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బళ్లారి నగరంలోని తన స్వగృహంలో సండూరు నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి కేఎస్.దివాకర్ నేతృత్వంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీజేపీలోకి చేరిన సందర్భంగా మాట్లాడారు.

బళ్లారి జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో జనం బీజేపీకి బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. సండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి బీజేపీకి జనం ఓట్లు వేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చే పురసభ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకే మెజార్టీ సీట్లు వస్తాయని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా జనం బీజేపీకి ఓట్లు వేస్తారన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగడం లేదన్నారు.

సండూరు బీజేపీ ఇన్‌ఛార్జి, బళ్లారి నగర మాజీ కార్పొరేటర్ కేఎస్.దివాకర్ మాట్లాడుతూ... సండూరు నియోజకర్గంలో బీజేపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జెడ్పీ, టీపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జనం బుద్ధి చెప్పారని, త్వరలో జరిగే పట్టణ పంచాయతీ, పురసభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.

సండూరులో ఏళ్ల తరబడి పాతుకుపోయిన పాలకులు అక్కడ వారి స్వార్థం కోసం రాజకీయాలు చేస్తూ సండూరు అభివృద్ధిని విస్మరించారని ధ్వజమెత్తారు. అంతకు ముందు సండూరు తాలూకాకు చెందిన కురేకుప్ప, తారానగర, వడ్డు తదితర గ్రాామాల కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివకుమార్, గాళి శంక్రప్ప, హెచ్.తిమ్మారెడ్డి, బసవన గౌడ, ఉప్పార శివలింగప్ప, శేఖర్ గౌడ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు