లక్ష్మీమీనన్‌పై శ్రుతిహాసన్ ఫైర్

5 Jun, 2015 03:21 IST|Sakshi
లక్ష్మీమీనన్‌పై శ్రుతిహాసన్ ఫైర్

 ఇద్దరు హీరోయిన్లు ఒక చిత్రంలో నటిస్తుంటే వారి మధ్య ఈగో సమస్య తలెత్తడం సహజం. అయితే ఇక్కడ నటి శ్రుతిహాసన్, లక్ష్మీమీనన్‌ల మధ్య మరో రకమైన విభేదాలు తలెత్తాయనే ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అసలు శ్రుతి టాప్ హీరోయిన్. లక్ష్మీమీనన్ ఎదుగుతున్న నటి. అలాంటిది వీరి మధ్య వైరం ఏమిటన్న ఆసక్తి కలగడం సహజం. అయితే వీరిద్దరూ కలసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్ర హీరో అజిత్.
 
 ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఎన్నై అరిందాల్ చిత్రం తరువాత ఆయన అజిత్ హీరోగా నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. వీరం చిత్రం తరువాత అజిత్‌ను శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా ఇదే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. ఇందులో అజిత్ చెల్లెలిగా నటి లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ దర్శకుడు శివ ఇంతకుముందు చిత్రం వీరంలో అజిత్‌ను తమ్ముళ్లపై అపారప్రేమ ఉన్న అన్నయ్యగా చూపించి విజయం సాధించారు.
 
  ఈ చిత్రంలో చెల్లెల్ని ప్రాణంగా చూసుకునే అన్నయ్యగా చూపించబోతున్నట్లు సమాచారం. దీంతో అసలు విషయం అర్థం అయ్యే ఉంటుంది. చిత్రంలో అన్నా చెల్లెళ్ల సన్నివేశాలు బలమైనవిగా ఉంటాయని లక్ష్మీమీనన్ ఇందులో చెల్లెలి పాత్ర చేయడానికి అంగీకరించినట్లు కనిపించిన వారికంతా డప్పు కొట్టుకుంటోందట. చిత్రంలో హీరోయిన్ శ్రుతి  పాటల సన్నివేశాలకే పరిమితం అని చిత్రంలో అజిత్ తరువాత బలమైన పాత్ర తనదేనని అందరకీ చెప్పుకుంటోందట. ఈ విషయం తెలిసి శ్రుతి లక్ష్మీమీనన్‌పై మండిపడుతున్నారని కోలీవుడ్ టాక్.
 

మరిన్ని వార్తలు