అతని చెంప చెళ్లుమనిపించాను

22 Nov, 2015 10:57 IST|Sakshi
అతని చెంప చెళ్లుమనిపించాను

చెన్నై :  క్షణ క్షణంబుల్ మారున్ జవరాళ్ల చిత్తంబుల్ అన్న జాతీయాన్ని నటి శ్రుతీహాసన్ జ్ఞప్తికి తెస్తున్నారు. ఇంతకు ముందు వరకూ తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. పెళ్లి చేసుకుని తీరాలన్నది రూలా? అనే విధంగా మాట్లాడిన నటి. ఇప్పుడు మనసు సడన్‌గా పెళ్లి పైకి మళ్లింది. పెళ్లి చేసుకోవాలి, ఆదర్శ తల్లినవ్వాలి అంటున్నారు. ఈ ముద్దుగుమ్మలో ఇంత మార్పుకు కారణాలేమిటబ్బా? అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆరాలు తీయడం మొదలెట్టాయి.

ఆ మధ్య టాలీవుడ్ చిత్రం శ్రీమంతుడు ఘన విజయాన్ని,తాజాగా కోలీవుడ్ చిత్రం వేదాళం సంచలన విజయాన్ని ఎంజాయ్ చేస్తూ పుల్ జోష్‌లో ఉన్నారు శ్రుతి. ఇక అసలు విషయం ఏమిటంటే ఇలా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సంచలన తార శ్రుతీహాసన్ ఇటీవల సీనియర్ నటి కుష్బూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ చానల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన గురించి ప్రచారం అవుతున్న వదంతులు, ప్రేమ, వ్యక్తిగత అంశాల గురించి చూద్దాం.
 
 నేనెవరికీ ప్రపోజల్ చేయలేదు
 ‘ఇప్పటి వరకూ నాకు ఎవరూ లవ్ ప్రపోజ్ చేయలేదు. అందువల్ల నేనూ ఎవరికీ పెళ్లి ప్రపోజల్ చేయలేదు. ఒక సారి స్నేహితుడొకరు ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమను ప్రపోజ్ చేశాడు. ఊహించని ఆ పరిణామానికి కాస్త చలించిన మాట నిజం. తక్షణమే తేరుకుని అతని చెంప చెళ్లుమనిపించాను. ఇక కోస్టార్స్‌తో చెట్టాపట్టాల్ లాంటి నిరాధార వదంతులకు స్పందిండం బోర్ అనిపిస్తోంది. కుటుంబం గురించి మాట్లాడాలంటే ముందుగా మా అమ్మ గురించే చెప్పాలి.

ఆమె కూతుర్ని కావడం గర్వంగా ఉంది. గత 20 ఏళ్ల క్రితమే పర్జానియా చిత్రంలో నటనకుగాను జాతీయ అవార్డును అందుకున్న నటి మా అమ్మ. అలాగే నాన్న కమలహాసన్, చెల్లెలు అక్షరలతో కలిసి నటించాలన్న కోరిక బలంగా ఉంది. అక్షరను నేనెప్పుడూ పోటీగా భావించను. తను నా చెల్లెలు. నా కళ్ల ఎదుట పెరిగింది. సినిమాలో ఎవరి స్థానం వారికి ఉంటుంది. వ్యక్తిగతం గురించి చెప్పాలంటే నాకిప్పుడు వెంటనే పెళ్లి చేసుకోవాలని, ఆదర్శ తల్లినవ్వాలని కోరిక’ అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు