సుపారి ఇచ్చి... భార్యను చంపించిన ఎస్ఐ
సహకరించిన హతురాలి తల్లి
మిస్టరీ వీడిన ప్రపుల్లా హత్య కేసు
తుమకూరు : హత్య కేసులు చేధించి బుర్ర పండిపోయింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న తన సొంత భార్యను హతమార్చేందుకు ఎస్ఐ ఏకంగా ఆమెను అడ్డు తొలగించుకోడానికి సుపారీ ఇచ్చి ఎలా హత్య చేయాలో కూడా వారికి పథక రచన చేశాడు హొసదుర్గ ఎస్ఐ గిరీష్. ఈ కేసును పోలీసులు చేధించి ఎస్ఐతో పాటు నిందితుడు చిదానంద, ప్రపల్లా తల్లి మహదేవమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ కార్తీక్రెడ్డి శనివారం మీడియాకు వివరించారు. ఎస్ఐ గిరీశ్కు గుబ్బి తాలూకా సంగోనహళ్లికి చెందిన ప్రపుల్లా(26)తో ఐదు సంవత్సరాల క్రితం
వివాహమైంది. మానసిక వ్యాధితో బాధపడుతున్న ప్రపుల్లా తరచూ ఇంటిలో గొడవపడేది. ఇష్టానుసారంగా ప్రవర్తించేది. దీంతో భార్యభర్తల సఖ్యత కొరవడింది. ప్రపుల్లాను అడ్డు తొలగించుకోవడానికి గిరీష్తో పాటు ప్రపుల్లా తల్లి మహాదేవమ్మ సైతం తన కుమార్తెను హత్య చేయడానికి సహకరించిందని ఎస్పీ చెప్పారు. రెండు నెలలకు ముందే బంధువుల ఇంటిలో ప్రపుల్లాను హత్య చేయాలని గ్రామ పంచాయతీ సభ్యుడు చిదానందకు సుపారీ ఇచ్చారు. ఈ మేరకు రూ. 50 వేలు చెల్లించారు. వాహనంతో ఢీకొట్టైనా లేదా హత్య చేసి చంపాలని గిరీష్ చిదానందకు సలహా ఇచ్చాడు. చిదానంద గిరీష్ కుటుంబానికి మొదటి నుంచే పరిచయం ఉంది. ఇదిలా ఉంటే ఈనెల 4న గిరీష్ చిదానందకు ఫోన్ చేసి ఎలా హత్య చేయాలో ఫోన్లో వివరించాడు. అదే పథకం ప్రకారం చిదానంద వేట కొడవలి తీసుకుని ద్విచక్ర వాహనంలో ప్రపుల్లా ఇంటికి వచ్చాడు. కొద్ది సేపు అనంతరం రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటికి రమ్మని బలవంత పెట్టి వాహనంలో ఎక్కించుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో పెట్రోల్ అయిపోయిందని చెప్పి డిక్కీలో ఉన్న వేటకొడవలి తీసుకుని తలపై పలుమార్లు నరికాడు. కొడవలిని పక్కనే ఉన్న పొదల్లో పడేసి వెళ్లాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో నిందితుడు అసలు విషయం వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.