భార్యే నిర్మాతగా..

15 May, 2015 09:47 IST|Sakshi
భార్యే నిర్మాతగా..

ఇరండాం ఉలగం చిత్రం ఆ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్‌ను చాలా విమర్శలకు గురి చేసింది. ఆ ఎఫెక్ట్ ఆయన్ని చాలా కాలం సినిమాకు దూరం చేసింది. ఎట్టకేలకు మళ్లీ  చిత్రం చేయడానికి సెల్వరాఘవన్ సిద్ధం అయ్యారు. సంచలన నటుడు శింబు హీరోగా నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే నటి త్రిష హీరోయిన్‌గా నటిస్తానని చెప్పి చివర్లో హ్యాండిచ్చారు. ఏదైమైనా చిత్రం నుంచి త్రిష వైదొగలగడం సెల్వరాఘవన్‌కు షాకే. అందులో నుంచి తేరుకుని మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించారు. అలా క్యాథరిన్ త్రెసా హీరోయిన్‌గా ఓకే అయ్యారు.
 
 అంతా బాగుందనుకున్న సమయంలో చిత్రానికి నిర్మాత లేకపోయారు. అందుకు వేరే కథ ఉంది లెండి. ఇలాంటి పరిస్థితిలో సెల్వరాఘవన్ తన భార్య గీతాంజలిని నిర్మాతగా చేసి గ్లో స్టూడియోస్ పతాకంపై చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం నిరాడంబరంగా ప్రారంభించారు. చిత్రంలో మరో హీరోయిన్‌గా నటి తాప్సీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయించినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. దీంతో ముఖ్య పాత్రలో ప్రముఖ తెలుగు నటుడు జగపతిబాబును నటింప చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు