శింబుతో రొమాన్స్‌కు లక్ష్మీమీనన్ రెడీ

26 Apr, 2015 01:53 IST|Sakshi
శింబుతో రొమాన్స్‌కు లక్ష్మీమీనన్ రెడీ

 శింబుతో రొమాన్స్‌కు నటి లక్ష్మీమీనన్ రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం.సంచలన నటుడు శింబుతో నటించిన హీరోయిన్లు అందరూ అగ్రకథా నాయికలయ్యారు. నయనతార, జ్యోతిక, త్రిష మొదలగు ప్రముఖ నాయికలు శింబుతో జోడి కట్టారు. తాజాగా లక్కీ హీరోయిన్ లక్ష్మీమీనన్ ఆయనతో స్టెప్స్‌కు సిద్ధం అవుతున్నారన్నది కోలీవుడ్ టాక్. శింబు నటించిన వేట్టైయన్నన్, వాలు, ఇది నమ్మ ఆళు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కావలసి ఉంది.
 
 వీటిలో వాలు చిత్రం మే నెల తొమ్మిదిన విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే శింబు నటించిన చిత్రం తెరపైకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది. అయినా ఆయనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అచ్చం ఎంబదు వాడమయడా చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా తాజాగా మరో కొత్త చిత్రానికి శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
 
  వణక్కం చెన్నై వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన క్రితిక ఉదయనిధి స్టాలిన్ తదుపరి శింబు హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో లక్ష్మీమీనన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలిసింది. కోలీవుడ్‌లో తొలి చిత్రం కుంకి నుంచి ఇటీవల విడుదలైన కొంభన్ చిత్రం వరకు విజయ పరంపరను కొనసాగిస్తున్న లక్ష్మీమీనన్ స్టార్ హీరోయిన్ అంతస్తును మాత్రం పొందలేకపోయారు. శింబు చిత్రం ఆమెకు ఆ కొరత తీరుస్తుందేమో చూద్దాం.
 

మరిన్ని వార్తలు