జల్సాలకు డబ్బు ఇవ్వలేదని..

13 Nov, 2014 02:12 IST|Sakshi

తల్లిని చంపిన  తనయుడు
నిందితుడి అరెస్ట్

 
బెంగళూరు : బైక్ రిపేర్ చేయించుకోవడానికి, స్నేహితులతో జల్సాలు చేయడానికి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన తల్లిని ఓ యువకుడు హతమార్చిన సంఘటన ఇక్కడి వివేక్‌నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  డీసీసీ సందీప్ పాటిల్ బుధవారం మీడియాకు తెలిపిన సమాచారం మేరకు.. వివేక్‌నగర సమీపంలోని ఈజీపుర ఆరవ క్రాస్‌లో ప్రభుత్వ రిటైడ్ ఉద్యోగిని మైలావతి (60) నివాసముంటున్నారు. ఈమె భర్త ఆనందన్ ఇళ్లను అద్దె, లీజ్‌లకు  ఇప్పించే బ్రోకర్ పని చేస్తున్నారు. వీరి కుమారుడు గిరీష్ గహన్ (23). ఆనందన్ రోజూ ఉదయం 11 గంటలకు బయటకు వెలితే రాత్రి ఇంటికి తిరిగి వస్తుంటారు. వీరి కుమార్తె యోగితకు వివాహమై భర్తతో కలిసి వేరుగా ఉంటోంది.  గిరీష్ డిప్లోమా పూర్తి చేసి ఎలాంటి ఉద్యోగం చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఇతనికి విలువైన కరిష్మా బైక్ ఉంది. బైక్ మరమత్తులకు రూ. 10 వేలు కావాలని తల్లిని కోరారు. తన దగ్గర డబ్బులు లేవని ఆమె పదేపదే చెప్పింది. ఈ విషయంలో గిరీష్ తల్లిని వేధించేవాడు. గత నెల 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో మైలావతి, ఆమె కుమారుడు గిరీష్ ఇద్దరే ఇంటిలో ఉన్నారు.

ఆ సమయంలో మైలావతి మెడలోని బంగారు గొలుసును లాక్కోవడానికి గిరీష్ ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో రెచ్చిపోయిన గిరీష్  ఆమెను కాలితో తన్నాడు. గొడకు తల తగలడంతో మైలావతి ృసహ తప్పి పడిపోయారు. అనంతరం చీరతో తల్లి గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత తల్లి మెడలో ఉన్న మంగళసూత్రం, నక్లెస్, మొబైల్ తీసుకున్నాడు. సంఘటనా స్థలంలో వేలిముద్రలు చిక్కకుండ కుంకమ చల్లి అక్కడి నుంచి పరారైనాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మైలావతి కుమార్తె యోగిత ఇంటికి వచ్చి చూడగా హత్య జరిగిన విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.  పోలీసులు గిరీష్‌పై నిఘా వేశారు. అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారణ చేయగా.. నేరాన్ని అంగీకరించాడు. తల్లి  మొబైల్‌లోని రెండు సిమ్‌కార్డులను ఆడుగోడి సమీపంలో పెద్ద డ్రెయినేజ్‌లో పారిసినట్లు చెప్పాడు.
 

మరిన్ని వార్తలు