20 నుంచి క్రీడాపోటీలు

19 Jan, 2014 23:44 IST|Sakshi

భివండీ, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భివండీ-నిజాంపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌ఎంసీ) విద్యావిభాగం విద్యార్థులకు సోమవారం నుంచి  వివిధ ఆటల పోటీలను నిర్వహించనుంది. స్థానిక ఛాలెంజ్ మైదానంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే తెలుగు విద్యార్థులకు  స్థానిక కార్పొరేటర్ నిత్యానంద్ నాడార్ దుస్తులను ఉచితంగా అందజేశారు.  కాగా బీఎన్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక్కొక్క పాఠశాల నుంచి సుమారు 30 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 3.000 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.

 కబడ్డీ, ఒంటికాలితో పరుగెత్తే ఆట (లంగ్‌డీ), ఖో ఖో, లాంగ్ జంప్, పరుగు పందెం, షాట్ ఫుట్‌లతోపాటు, చిత్ర కళ, హస్త కళ తదితర పోటీలను నిర్వహించనున్నామని విద్యామండలి సభాపతి రాజు. గాజెంగి తెలిపారు. మూడురోజులపాటు కొనసాగే ఈ పోటీలలో పాల్గొనే విద్యార్థులకు అల్పాహారం, మంచి నీటివసతితో పాటు వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. విజేతలకు గణతంత్రి దినోత్సవంరోజున బహుమతులను అందజేస్తామన్నారు.

 ఈ పోటీల్లో పాల్గొననున్న తెలుగు పాఠశాల నం 23కు చెందిన విద్యార్థులకు సమాజ సేవకుడు కనకవేలు ఉచితంగా క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కనకవేలు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం తెలుగు పాఠశాలల విద్యార్థులందరికీ క్రీడా దుస్తులను అందజేస్తామన్నారు.

మరిన్ని వార్తలు