రాష్ట్రానికి మీరే గర్వకారణం

8 Aug, 2014 02:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  కామన్వెల్త్ క్రీడల్లో అయిదు రజత పతకాలను గెలుచుకున్న క్రీడాకారులను హోం మంత్రి కేజే. జార్జ్, రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డిలు సత్కరించారు. కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ (కేవోఏ) గురువారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పీఎన్. ప్రకాశ్ నంజప్ప (షూటింగ్), అశ్విని పొన్నప్ప (షటిల్ బ్యాడ్మింటన్), వీఆర్. రఘునాథ్, ఎస్‌వీ. సునీల్, నిఖిన్ తిమ్మయ్య (హాకీ)లు సత్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జార్జ్, క్రీడాకారుల సాధన అపూర్వమని కొనియాడారు. మరిన్ని విజయాలను సాధించాలని  ఆకాంక్షించారు. ఓడిపోయిన వారు నిరాశ చెందరాదని ధైర్యం చెప్పారు. కేవోఓ అధ్యక్షుడు గోవిందరాజు మాట్లాడుతూ ఇలాంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలను గెలుచుకున్న వారికి నగదు బహుమతితో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారని గుర్తు చేశారు.

నివేశనంతో పాటు స్వర్ణ పతక విజేతలకు రూ.25 లక్షలు, రజత పతక విజేతలకు రూ.10 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పారని వెల్లడించారు. అక్టోబరులో నిర్వహించే బ్రహ్మాండమైన కార్యక్రమంలో ఈ బహుమతులు అందజేస్తారని తెలిపారు.
 

మరిన్ని వార్తలు