కాంగ్రెస్ విజయబావుటా

24 Feb, 2016 02:00 IST|Sakshi
కాంగ్రెస్ విజయబావుటా

1,083 జెడ్పీ,  3,884 టీపీ క్షేత్రాల ఫలితాలు వెల్లడి
498 జెడ్పీ క్షేత్రాలు, 1,705 టీపీ  క్షేత్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
రెండో స్థానంలో కాషాయం
408 జెడ్పీ క్షేత్రాలు,1,362
టీపీ క్షేత్రాల్లో వికసించిన కమలం
మూడోస్థానంతో సరిపెట్టుకున్న దళం నాయకులు
148 జెడ్పీ క్షేత్రాలు,610 టీపీ క్షేత్రాల్లో జేడీఎస్ అభ్యర్థుల విజయం

 
బెంగళూరు:  ‘స్థానిక’ సంగ్రామంలో కాంగ్రెస్‌పార్టీ పై చేయి సాధించింది. ప్రధాన విపక్షాలైన భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలవగా జేడీఎస్ పార్టీ మూడోస్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం గెలిచిన స్థానాలను బట్టి కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించినా రెండోస్థానంలోని బీజేపీతో పోలిస్తే సదరు మెజారిటీ తక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.  జేడీఎస్ గత జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో మరింత కిందికి దిగజారిపోయింది. సంఖ్య పరంగా కాంగ్రెస్‌ది పై చేయి అయినా  రానున్న శాసనసభ ఎన్నికలకు సెమిఫైనల్‌గా భావిస్తున్న ఈ జెడ్పీ,టీపీ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 1,083 జిల్లా, 3,884 తాలూకా పంచాయతీ క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో మూడు జిల్లా, పద్నాల్గు తాలుకా పంచాయతీ క్షేత్రాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన క్షేత్రాలకుగ రెండు దశల్లో (ఈనెల 13, 20తేదీల్లో ) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి నుంచి చివరి వరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో  అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్ష బీజేపీ మధ్యనే పోటీ నెలకొంది. జేడీఎస్ మాత్రం హాసన జిల్లాల్లో మాత్రం తన ప్రభావాన్ని చూపించింది.

సంఖ్యాబలంలో కాంగ్రెస్ దే పై చేయి ........
జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ 498 జిల్లా పంచాయతీ క్షేత్రాల్లో గెలుపొందగా విపక్ష భారతీయ జనతా పార్టీ 408 స్థానాల్లో, జేడీఎస్ అభ్యర్థులు 148 క్షేత్రాల్లో విజయం సాధించారు. మిగిలిన వారిలో 27 మంది స్వతంత్య్ర అభ్యర్థులు కాగా ఒకరు సీపీఎం నుంచి మరొకరు జేడీ(యూ) తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ  1,705         తాలూకా పంచాయతీ క్షేత్రాల్లో  గెలుపొందగా, బీజేపీ  1,362  టీపీ క్షేత్రాల్లో, జేడీఎస్ 610 టీపీ క్షేత్రాల్లో విజయం సాధించాయి. ఇక  బీఎస్‌పీ ఐదు, సీపీఎం ఆరు, జేడీయూ తొమ్మిది టీపీ క్షేత్రాల్లో గెలుపొందాయి.  అదేవిధంగా 179 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల గెలుపొందగా  ఇతరులు ఎనిమిది టీపీ క్షేత్రాల్లో గెలుపొందారు.  
 
ఏక గ్రీవంలో బీజేపీదే పై చేయి...
జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో మూడు జిల్లా పంచాయతీ క్షేత్రాలతో పాటు పద్నాల్గు తాలూకా పంచాయతీ క్షేత్రాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏక గ్రీవ ఎన్నికల్లో విపక్ష భారతీయ జనతా పార్టీదే పై చేయి.  రెండు జిల్లా పంచాయతీ క్షేత్రాలు (ఆళ్లూరు, వడ్డేరహట్టి), ఎనిమిది తాలూకా పంచాయతీ క్షేత్రాల్లో బీజేపీ అభ్యర్థుల మెడలో ఎటువంటి పోటీ లేకుండానే విజయమాల పడింది.అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక్కరు కూడా జిల్లా తాలూకా పంచాయతీ క్షేత్రంలో ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు. తాలూకా పంచాయతీ క్షేత్రాల్లో మాత్రం నాలుగింటిలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. జేడీఎస్ అభ్యర్థులు ఒక జిల్లా (రాయచూరు జిల్లా, సింగనూరు తాలూకా, గుగుంటా క్షేత్రం) పంచాయతీ క్షేత్రం, ఒక తాలూకా (బబళేశ్వర) పంచాయతీ క్షేత్రాల్లో ఎటువంటి పోటీ లేకుండా గెలపొందగా ఒక స్వతంత్య్ర అభ్యర్థి ఇండి తాలూకా ఉమ్రాణి తాలూకా పంచాయతీ క్షేత్రంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్‌కు నిరాసే!
2011లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ 30 జిల్లాల పైకి పన్నెంటిలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. అప్పుడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 6, జేడీఎస్ నాలుగు జిల్లాలో జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోగా మిగిలిన పదింటిలో పొత్తులకు అవకాశం ఏర్పడింది. అయితే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ కేవలం 11 జిల్లాల్లో మాత్రమే స్పష్టమైన మెజారిటీతో జెడ్పీ స్థానాలను సాధించింది. దీంతో అధికారంలో ఉండి కూడా ఆ పార్టీ పెద్ద ప్రభావాన్ని చూపించలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  తాము ఆశించినంతగా ఈ తాజా ఎన్నికల్లో విజయం సాధించలేకపోయామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా పేర్కొంటుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు