ప్రయాణికులపై సర్'చార్జ్'

20 Oct, 2016 13:55 IST|Sakshi
సర్‌చార్జీని వసూలు చేస్తున్నట్లు బోర్డు అంటించిన రైల్వే శాఖ
బెల్లంపల్లి :‘చెప్పుకోను పోతే పట్టుకొని కొట్టినట్లు’గా తయారైంది రైలు ప్రయాణికుల పరిస్థితి. ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బదులు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని అడిగిన పాపానికి ప్రయాణికులపై రైల్వే శాఖ పెను భారం మోపింది. కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చి సర్‌చార్జి వసూళ్లకు పాల్పడుతోంది. గమ్య స్థానానికి కేవలం ఐదు నిమిషాలు ముందుగా వెళ్తోందనే కారణంతో ఒక్కో ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ.15  రైలు ప్రయాణికులపై సర్‌‘చార్జ్‌’ చొప్పున సర్‌చార్జి వసూలు చేస్తోంది. ప్రయాణికుల కష్టనష్టాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా, కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా  సర్‌చార్జి భారం మోపి జేబులు గుల్ల చేస్తోంది. సర్‌చార్జి వసూలుతో సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణం వద్దురా బాబోయ్‌ అని ప్రయాణికులు గగ్గోలు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్వే శాఖ అనుసరిస్తున్న తీరుపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.
 
ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్‌ రైలుగా మార్చి..
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌–రాష్ట్ర రాజధాని సికింద్రాబాద్‌ మధ్య కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రైలును ప్రవేశపెట్టారు. ఈ రైలు కుమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జనగామ, యాదాద్రి జిల్లాల మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణంలో ఈ రైలు 12 స్టేషన్లలో ఆగుతుంది. రోజువారీగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నా ఈ రైలుకు ముఖ్యమైన, సాధారణ రైల్వే స్టేషన్లలోనూ హాల్టింగ్‌ ఇస్తున్నారు. సత్వరంగా గమ్యస్థానం చేరుకోలేక రైలులోనే గంటలకొద్ది ప్రయాణం సాగిస్తున్నారు.  
 
పేరు మారిందే కాని...
కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారే తప్ప మరెలాంటి మార్పులు జరగలేదు. వేగంలో కొద్దిపాటిగా తేడా ఉన్నా, రైల్వే స్టేషన్ల హాల్టింగ్‌లో మాత్రం మార్పులు చోటు చేసుకోలేదు. పాత పద్ధతిలోనే ప్రతి రైల్వేస్టేçÙన్‌లోనూ కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగుతోంది. కాకపోతే గతంలో కన్న ఐదు నిమిషాల ముందు గమ్యస్థానం చేరుకుంటోంది. ఎక్స్‌ప్రెస్‌ రైలు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా రూపాంతరం చెందిన ప్రయాణికులకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. పైపెచ్చు సర్‌చార్జి వసూలుతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ చార్జి వసూలు చేస్తున్నారు. 
 
రూ.కోట్ల భారం
సర్‌చార్జి పేరుతో రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి రూ.కోట్లలో ఆదాయం సమకూర్చుకుంటోంది. తద్వారా ప్రయాణికులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కి ముందు వచ్చే రైల్వే స్టేషన్‌లో దిగిన కూడా సర్‌చార్జి రూ.15 చెల్లించుకోక తప్పదు. తూర్పు ప్రాంతంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలోని పలు ప్రాంతాల నుంచి రోజువారీగా వేల సంఖ్యలో ప్రయాణికులు కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాకపోకలు చేస్తున్నారు. రోజువారీగా కనిష్టంగా 3 వేల నుంచి గరిష్టంగా 4 వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఆ తీరుగా ఒక్కో టికెట్‌పై రూ.15 చొప్పున సర్‌చార్జి రోజుకు రూ.45 వేలు వసూలు అవుతుండగా, నెలకు రూ.13.50 లక్షలు, ఆ ప్రాతిపదికన ఏడాదికి సుమారు రూ.1.62 కోట్లు రైల్వే ఖజానాకు సమకూరుతోంది. 
 
 
మాది బెల్లంపల్లి. కిరాణ వ్యాపారం చేస్తున్నాను. ప్రతి నెలలో హైదరాబాద్‌కు రెండు, మూడుసార్లు ప్రయాణం సాగిస్తాను. కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రతి స్టేషన్‌లోనూ ఆగుతుండటంతో ఇన్నాళ్లు ఇబ్బందు లు పడ్డాం. అదే రైలును ఇప్పుడు సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు. కానీ.. ఎక్స్‌ప్రెస్‌ రైలు మాదిరిగానే అన్ని స్టేషన్లలోనూ ఆగుతోంది. సర్‌చార్జి మాత్రం రూ.15 అదనంగా వసూలు చేస్తుండడం గమనార్హం. రైల్వేస్టేషన్ల హాల్టింగ్‌లో మార్పులు చేయకుండా, వేగం పెంచకుండా సర్‌చార్జి వసూలు చేయడం సరికాదు. 
- బ్రిజ్‌గోపాల్‌ లోయ
 
మరిన్ని వార్తలు