డాక్టర్‌ పోలిరెడ్డికి రెండు జాతీయ అవార్డులు

28 Sep, 2016 11:03 IST|Sakshi
గిద్దలూరు : పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.పోలిరెడ్డి రెండు జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్నారు. న్యూ ఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, మేనేజ్‌మెంట్‌ వారు ఇచ్చే లైఫ్‌ టైమ్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో పాటు, మహాత్మాగాంధీ నేషనల్‌ పీస్‌ అవార్డులకు ఎంపికయ్యారు. ఆ మేరకు ఇటీవల అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో ఈనెల 18వ తేదీన జైళ్లశాఖ పూర్వ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సి.ఎన్‌.గోపినాథరెడ్డి చేతుల మీదుగా మహాత్మాగాంధీ నేషనల్‌ శాంతి అవార్డును అందుకున్నారు.

శాంతి, మానవతా విలువలను పెంపొందించేందుకు చేస్తున్న కృషికి ఈ అవార్డును ఇచ్చారని పోలిరెడ్డి తెలిపారు. లైఫ్‌టైమ్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును నేరుగా పంపినట్లు చెప్పారు. ఆంగ్ల సాహిత్యంలో 15మంది పీహెచ్‌డీ స్కాలర్స్, ఐదు మంది ఎంఫిల్‌ స్కాలర్స్‌కు ఆచార్య నాగార్జున యూనియవర్సిటీ నుంచి రీసర్చ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంగ్లంలో ఈయన రచించిన రెండు గ్రంథములు, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని సమర్పించిన పలు పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమయ్యాయి. 
జాతీయ స్థాయిలో అవార్డులందుకుంటున్న పోలిరెడ్డిని ఎస్వీ కళాశాలల కరస్పాండెంట్, మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయికల్పనారెడ్డి, రాంభూపాల్‌రెడ్డి,  కళాశాల కార్యదర్శి పి.అభిషేక్‌రెడ్డి, కళాశాలల కో ఆర్డినేటర్‌ విఠా సుబ్బరావు, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.
మరిన్ని వార్తలు