తాళి కట్టేవేళ ఆగిన పెళ్లి

3 Nov, 2014 02:54 IST|Sakshi

రాయచూరు రూరల్ : రాయచూరు తాలూకా రాంపూర్‌లో ఆదివారం యువతి, యువకుల ప్రేమ విషయంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు గాయపడ్డారు. బైక్‌కు నిప్పు పెట్టారు. పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. గ్రామంలో మాజీ సైనికుడు జాన్ కుమార్తె జాసిమిన్(16), సురేష్ కుమారుడు సంతోష్ కుమార్(16) కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు.

ఈ విషయం తెలియడంతో కుమార్తెను జాన్ నెల రోజుల క్రితం మందలించారు. దీంతో కోపగించుకున్న సంతోష్‌కుమార్ జాన్‌పై కక్ష కట్టాడు. 20 రోజుల క్రితం గుల్బర్గాకి వెళ్లిన జాన్‌ను తన స్నేహితులు ఆరుగురితో కలిసి సంతోష్‌కుమార్ దాడి చేశారు. దీంతో జాన్ గుల్బర్గా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. వారు శనివారం జామీనుపై విడుదలై రాయచూరు చేరుకున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు సంతోష్‌కుమార్, అతని మిత్రులు కలిసి జాన్ ఇంటిపైకి దాడి చేశారు. అక్కడే ఉన్న మోటారు వాహనానికి నిప్పు పెట్టారు. అడ్డం వచ్చిన జాన్ తమ్ముడు నతానియల్, అన్న కొడుకు దిలీప్‌ను కత్తితో గాయపరిచారు. తలుపులు, కిటికీల గ్లాసులను ధ్వంసం చేశారు.

గ్రామంలో రక్షణ కల్పించేందుకు వెళ్లిన పోలీసులపైనా వారు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, దాడికి పాల్పడిన 11 మందిని అరెస్ట్ చేశామని ఎస్‌పీ నాగరాజ్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు