పోలీసులా.. మజాకా...!

21 May, 2017 13:49 IST|Sakshi

– 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు
– కోర్టు ప్రశ్నలతో పోలీసుల ఉక్కిరి బిక్కిరి
– సమగ్ర విచారణకు ఆదేశం


చెన్నై: పోలీసులు తలచుకుంటే తప్పు చేయని వాడి మీద కూడా కేసుల మోతతో  ఊచలు లెక్కించేలా చేస్తారన్న నానుడికి అద్దంపట్టే రీతిలో ఇటీవల ఓ వృద్ధుడి మీద కేసు నమోదైంది. 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు పెట్టడం కోర్టును సైతం విస్మయంలో పడేసినట్టుంది. కోర్టు ప్రశ్నలతో చెన్నై పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. సమగ్ర విచారణకు ఆదేశిస్తూ, ఆ వృద్ధుడికి నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు అయింది.

ఆర్కేనగర్‌ – మణలి రోడ్డులో  ఉన్న ఎలిల్‌ నగర్‌కు చెందిన వేదక్కన్‌ నాడార్‌ (74)పై గత నెల పోలీసులు ఓ కేసు పెట్టారు. రెండు కేజీల వంద గ్రామాలు గంజాయిని తన ఇంటి బీరువాలో దాచి ఉంచిన అభియోగంపై ఆర్కేనగర్‌ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆగమేఘాలపై కోర్టుకు హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టారు.

కోర్టు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి :  పిటిషనర్‌ తరపున న్యాయవాది ఆర్‌ రాజన్‌ హాజరై వాదన వినిపించారు.  రూ 1000 కోట్ల విలువచేసే 250 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగాయని, సాగుతున్నాయని, ఇందుకు అడ్డుగా ఉన్న వేదక్కన్‌ నాడార్‌ను గురిపెట్టి ఈ తప్పుడు కేసు బనాయించారని  వాదించారు. పోలీసులు కాలయాపణ చేస్తూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం లేదని బెంచ్‌ దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి.

74 వృద్ధుడి మీద ఈ కేసు నమోదు కావడం బట్టి చూస్తే,  తప్పుడు కేసు బనాయించారా..? మరేదైనా కారణాలు ఉన్నాయా..?  ఉంటే, సమగ్ర విచారణకు సాగించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసును ప్రత్యేక అధికారి ద్వారా విచారించేందుకు తగ్గ చర్యలు చేపట్టాలని చెన్నై పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. అలాగే, వేదక్కన్‌ నాడార్‌కు నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

మరిన్ని వార్తలు