సెల్‌ ఫోన్‌ పేలి చూపు కోల్పోయిన యువతి

29 Apr, 2020 08:30 IST|Sakshi

సాక్షి, చెన్నై:  సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌లో పెట్టి వీడియో కాల్‌ మాట్లాడుతున్న సయయంలో దురదృష్టవశాత్తూ ఫోన్‌ పేలడంతో ఓ యువతి చూపు కోల్పోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...తిరువారూరు జిల్లా నీడామంగళం ముట్టయ్యకొత్తనార్‌ తందు ప్రాంతానికి చెందిన సుకుమార్‌ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కుమార్తె ఆర్తి సోమవారం తన తండ్రితో వీడియో కాల్‌లో మాట్లాడుతోంది. అయితే అకస్మాత్తుగా సెల్‌ పేలడంతో... ఆ ముక్కలు ఆర్తి కళ్ళలో గుచ్చుకున్నాయి. చెవిలోకి కూడా వెళ్లాయి. దీంతో కుటుంబీకులు ఆర్తీని వెంటనే నీడామంగళం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సకు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకుప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సెల్‌ ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి ఫోన్‌ మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

కాగా సెల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఉపయోగించడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఫోన్‌ వాడకంపై అజాగ్రత్తగా ఉండటం వల్లే గాయపడటంతో పాటు, ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా జనాల్లో అవగాహన లేకుండా పోతోంది. ఛార్జింగ్ పెట్టిన ఫోన్‌ని అలాగే మాట్లాడటం, తడి చేతులతో ఛార్జింగ్ పెట్టడంతో పాటు రాత్రంతా  చార్జింగ్ పెట్టిన ఫోన్లు విపరీతంగా వేడెక్కి పేలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫోన్లు వాడకాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసినా, పట్టించుకోకపోవడంతోనే ఇటువంటి సంఘటనలకు దారితీస్తున్నాయి.

మరిన్ని వార్తలు