అనారోగ్యశ్రీగా మారుస్తున్న సీఎం

5 Oct, 2016 02:50 IST|Sakshi
అనారోగ్యశ్రీగా మారుస్తున్న సీఎం

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పేదల పెన్నిధిగా ఉన్న ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ పథకంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ధ్వజమెత్తింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక అయిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని ప్రారంభించి, 920 రుగ్మతలకు ఇందులో భాగంగా వైద్యసేవలు అందించిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దేనని పేర్కొంది.

మంగళవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్సార్ హయాంలో 2007లో మొదట మూడు జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించి, ఆ తర్వాత అన్ని జిల్లాలకు వర్తింపజేసి పకడ్బందీగా అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు ఆరు సార్లు బంద్ చేశాయన్నారు.

ఏటా బతుకమ్మ నిర్వహణకు నిధులు పెంచుతూ పోతున్న ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ అంటే ఎందుకంత నిర్లక్ష్యం చూపుతున్నదో చెప్పాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేసి, భవిష్యత్‌లో మళ్లీ ఈ సేవలు స్తంభించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు