తెలుగు యువకుడి ఆత్మహత్య

7 Oct, 2013 02:17 IST|Sakshi

పుణే సిటీ, న్యూస్‌లైన్: ఘోర్పడి శ్రీనాథ్‌నగర్‌లో నివాసముంటున్న ఓ తెలుగు యువకుడు గురువారం కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం అతని మృతదేహాన్ని వెలికితేశారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. హడప్సర్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, చంద్రశేఖరపురం మండలం, పులగోరు పల్లె నుంచి బతుకు దెరువు నిమిత్తం మేక తిరుపాల్, భాగ్యమ్మ దంపతులు నగరానికి వచ్చారు. వీరి పెద్ద కుమారుడు మేక ప్రవీణ్ (22)తోపాటు గత 20 ఏళ్లుగా శ్రీనాథ్‌నగర్‌లోని 5వ నంబరుకాలనీలో ఉంటున్నారు. అయితే పట్టభద్రుడైన ప్రవీణ్ గత కొన్ని రోజులుగా ఏదో విషయమై తీవ్ర వేదనకు గురవుతున్నాడని స్నేహితులు పేర్కొన్నారు.
 
 ఆత్మహత్య చేసుకునేందుకు కొన్నినిమిషాల ముందు తన స్నేహితులకు ‘ఈ రోజు నా జీవితానికి ఆఖరి రోజు’ అనే మె సేజ్ కూడా పంపాడని తెలిసింది. తర్వాత ఈ సమాచారం తల్లిదండ్రులకు చేరడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. చివరికి ప్రీతి ప్రకాష్ సొసైటీ కార్యాలయం వెనుక ఉన్న పెద్ద కాలువ కట్టపై అతని మొబైల్, చెప్పులు ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అం దించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టడంతో శుక్రవారం మధ్యాహ్నం అతని మృత దేహాన్ని వెలికితీశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బంధువులు రావడంతో ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు