ఇక టోలు తీస్తారు

23 Aug, 2018 11:56 IST|Sakshi

టోల్‌గేట్‌ చార్జీలు 10 శాతం పెంపు

1వ తేదీ నుంచి అమల్లోకి

సాక్షి ప్రతినిధి, చెన్నై: జాతీయ రహదారుల్లోని టోల్‌గేట్ల మీదుగా పయనించే అన్నిరకాల వాహనాలకు రుసుమును వసూలు చేసే ప్రక్రియ ఎంతోకాలంగా సాగుతోంది. ఏ కేటగిరి వాహనాలకు ఎంత వసూలు చేయాలో జాతీయరహదారుల శాఖే నిర్ణయిస్తోంది. టోల్‌గేట్‌లో చార్జీల వసూళ్లకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ఎంపిక చేస్తుంది. ఈ కారణంగా ఒక్కో టోల్‌గేట్‌లో ఒక్కో చార్జీని వసూలు చేస్తున్నారు.

టోల్‌గేట్‌ చార్జీల వసూళ్లలో పేరొందిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటిగా నిలిచి ఉంది. ఈ దశలో రాష్ట్రంలోని దక్షిణ, పశ్చిమ జిల్లాల వైపు వెళ్లే జాతీయ రహదారుల్లోని 14 టోల్‌గేట్ల చార్జీలను పదిశాతం పెంచాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయని అధికారులు చెప్పారు.  ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కేంద్రం త్వరలో విడుదల చేస్తుందని అన్నారు. సేలం–ఉళుందూరుపేట–మేట్టుపట్టి– దిండివనం–నల్లూరు, చెన్నై–తిరుచ్చిరాపల్లి–దిండుగల్లు, నత్తకరై,–వీరచోళపురం–విక్కిరవాండి–తడ (ఆంధ్రప్రదేశ్‌)–పొన్నంబళ్‌పట్టిలలోని 14 టోల్‌గేట్లలో పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు. కార్లకు పదిశాతం, బస్సులు, లారీలకు 4 నుంచి 6 శాతం వరకు పెరుగుతుందని చెప్పారు.

వసూళ్లేగానీ వసతులేవీ: టోల్‌గేట్‌ల ద్వారా ముక్కుపిండి వసూళ్లు చేయడమేగానీ, అందుకు తగినట్లుగా వసతులులేవని టోల్‌గేటు చార్జీల పెంపుపై వాహన యజమానులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. వారు మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్, పెట్రోలు ధరలతో ఎంతో బాధపడుతున్నాం, ఇపుడు టోల్‌గేట్‌ చార్జీలు కూడా పెంచడం వల్ల మోయలేని భారం పడుతుందని అన్నారు. ఈ ఏడాది మార్చిలో చెన్నై, చెన్నై శివార్లలోని 6 టోల్‌గేట్లు సహా మొత్తం 20 టోల్‌గేట్ల చార్జీలను పెంచారని తెలిపారు. రెండేళ్లలో తమిళనాడులో టోల్‌గేట్‌ చార్జీలు 21 శాతం పెరిగాయని ఆయన అన్నారు. టోల్‌గేట్‌ ద్వారా వచ్చే వసూళ్లతో రహదారుల మరమ్మతులు, పర్యవేక్షణకు వినియోగిస్తామని అధికారులు చెబుతుంటారు, అయితే వాస్తవానికి అనేక రహదారులు పర్యవేక్షణ లోపంతో వాహనదారులను బాధిస్తున్నాయి. అధికా రులే హామీ ఇచ్చినట్లుగా రహదారుల్లోఅక్కడక్కడ టెలిఫోన్, తాగునీటి వసతి, ఫుడ్‌కోర్టులు లేవు. ముఖ్యంగా పారిశుధ్యమైన టాయిలెట్లు లేనికారణంగా బాహ్యప్రదేశంలోనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్థితిని వాహనదారులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు.

మరిన్ని వార్తలు