తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

4 Jan, 2017 18:14 IST|Sakshi
తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: విపక్షాల ఆందోళనతో తెలంగాణ శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు సభ లోపల బైఠాయించారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పై అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రభుత్వం తగిన సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు నిరసన కొనసాగిస్తున్నారు.

ఫీజులపై తమ ప్రశ్నలకు కేసీఆర్‌ సర్కారు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆందోళన విరమింపజేసేందుకు అసెంబ్లీ కార్యదర్శి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రంగంలోకి దిగిన పోలీసులు... ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు ప్రతిఘటించడంతో తోపులాటలు జరిగాయి. ఎమ్మెల్యేలను ఆయా పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులు వదిలిపెట్టారు.